కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై

MP kesineni nani

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచి విజయవాడ ప్రజలకు సేవ చేయడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కేశినేని నాని అన్నారు. విజయవాడ నియోజకవర్గ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయని కేశినేని నాని అన్నారు. వారు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

తాను రాజకీయ రంగానికి దూరమవుతున్నప్పటికీ విజయవాడ అభివృద్ధి పట్ల తన నిబద్ధత ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. విజయవాడకి తాను చేయగలిగినది చేస్తూనే ఉంటానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

తన జీవితంలో కొత్త అధ్యాయం వైపుగా పయనిస్తున్నానని, ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలను తనతో తీసుకువెళుతున్నానని అన్నారు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కృషిచేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.