YSRCP MLAs: అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?
వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక.. ఆయనకు సమాచారం ఇచ్చే సంతకాలు పెట్టి పోతున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది.

Ayyanna Patrudu
అసెంబ్లీ.. తెలంగాణ సభలో అయితే 119 మంది, ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అందరు ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కారు. కొందరు ఎమ్మెల్యేలు తాము మాట్లాడే సమయం ఇచ్చిన రోజు మాత్రమే సభకు వస్తుంటారు. ఇది ఏపీ తెలంగాణలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోని అసెంబ్లీలో అయినా ఇదే సీన్ కనిపిస్తోంది.
అయితే ఏపీ అసెంబ్లీలో మాత్రం కాస్త డిఫరెంట్ సీన్ ఉందట. సభకు హాజరు కాబోమంటూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ సభ్యులు.. అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం సంతకాలు పెట్టి పోతున్నారట. కొందరు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఏకంగా రాతపూర్వక ప్రశ్నలు అడిగి చేతులు దులుపుకుంటున్నారట.
గురువారం సభకు స్టార్ట్ అవ్వగానే.. సభ్యుల హాజరు శాతం చూసి అవ్వాక్కయ్యారట ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఇదేంటి సభ పలచగా ఉందేంటంటూ ఆరా తీశారట. ఏకంగా అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారులతో రిజిస్టర్ తెప్పించి పరిశీలించిన స్పీకర్ షాక్ అయ్యారట. 80శాతం అటెండెన్స్ ఉంటే.. సభలో 50శాతానికి మించి సభ్యులు కనిపించడం లేదంటూ స్పీకర్ ఫైర్ అవడం హాట్ టాపిక్ అవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు దొంగల్లాగా గుట్టు చప్పుడు కాకుండా..ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీ సెక్రటేరియెట్కు వచ్చి అటెండెన్స్లో సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా సొంత వ్యవహారాలు చూసుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు.
సభకు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోవడం సరికాదంటూ తీవ్రంగా మందలించారు అయ్యన్న. ప్రజలు ఎన్నుకున్న సభ్యులు సభకు వచ్చి ప్రజల సమస్యలపై స్పందించాలని, చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు ఎదురైతే తీవ్రంగా రియాక్ట్ కావాల్సి వస్తుందని ఘాటు కామెంట్స్ చేశారు.
అధినేత ఆదేశాల పేరుతో అసెంబ్లీకి వెళ్లడం లేదా?
అంతేకాదు వైసీపీ సభ్యుల హాజరుపై సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ సభ్యులను సభలోకి రానివ్వలేదా అంటూ స్పీకర్ను అడిగారు సభా నాయకుడు సీఎం చంద్రబాబు. దొంగ చాటు సంతకాల ఖర్మ ఏంటో తనకు అర్ధం కావట్లేదన్న స్పీకర్.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ సభకు అటెండ్ కానీ వారికి అనర్హత వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తామనడం మరింత చర్చనీయాంశం అవుతోంది.
గవర్నర్ ప్రసంగం రోజు తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కాకుండా.. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు వారు సభకు రావాలని ఉన్నా.. అధినేత ఆదేశాల పేరుతో అసెంబ్లీకి వెళ్లడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సరే అటెండెన్స్ విషయం అలా ఉంచితే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని రాతపూర్వకంగా ప్రశ్నలు అడగటంపై కూడా కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్గా స్పందించడం..అసెంబ్లీకి రహస్యంగా వచ్చి వెళ్లిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించే స్పీకర్ దొంగలు అన్న పదం వాడటంపై చర్చ నడుస్తోంది. రిజిస్టర్లో సంతకాలు చేసి సభలో కనిపించని వారిలో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు స్పీకర్. వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజుల పేర్లు చదవి వినిపించారు అయ్యన్నపాత్రుడు.
అయితే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక.. ఆయనకు సమాచారం ఇచ్చే సంతకాలు పెట్టి పోతున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది. మొత్తానికి అయ్యన్న పాత్రుడు అధికారికంగా సభలో చేసిన ప్రకటన వైసీపీకి మరింత నష్టం చేసే అంశమేనన్న చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో సంతకాలు చేసివెళ్లినట్లు చెప్పడం..ఇలా సంతకాలు చేసినవాళ్ళు సభలో కనిపించకపోవడంతో వైసీపీ మరింత కార్నర్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. స్పీకర్ కామెంట్స్పై వైసీపీ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.