ఫ్యాన్ పార్టీకి సేనాని సెగ గట్టిగానే తగిలిందా? అందుకే నష్టం తప్పదని ఇలా రూట్‌ మార్చారా?

జగన్‌ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా పవన్‌కు అనుకూలంగా జపం చేస్తున్నారు.

ఫ్యాన్ పార్టీకి సేనాని సెగ గట్టిగానే తగిలిందా? అందుకే నష్టం తప్పదని ఇలా రూట్‌ మార్చారా?

Pawan Jagan

Updated On : February 20, 2025 / 7:42 PM IST

అధికారంలో ఉన్నప్పుడు అంతా చక్కగానే కనిపిస్తోంది. ఏం చేసినా సూపర్ సార్‌ అనేవాళ్లే ఎక్కువుంటారు. వన్స్ పవర్‌ చేజారితే..పరువు గుర్తుకు వస్తుంది. అప్పుడు ఎవరి వల్ల ఈ డ్యామేజ్‌ జరిగిందని వెనక్కి వెళ్లి చూసుకుంటే స్వయం కృతాపరాధమే అని తెలిసి.. డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం రూట్ మార్చాల్సిందే. ఇప్పుడు ఇలాంటి సిచ్యవేషన్‌లోనే ఉందట వైసీపీ.

ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడడానికి కారణాలేంటని విశ్లేషించుకుంటున్న టైమ్‌లో ఆ ఒక్కడి జోలికి వెళ్లకుంటే బాగుండేదని..నేతల తమ మనోగతం బయటపెట్టారట. పవన్‌ను పర్సనల్‌గా అటాక్‌ చేయడం వల్లే కాపులు తమకు దూరమయ్యారని భావిస్తున్నారట వైసీపీ నేతలు. సేనానిని విమర్శించడం వల్ల యూత్ ఓట్లు కూడా తమకు పోలరైజ్‌ కాలేదని అనుకుంటున్నారట. పలువురు నేతల సూచనల ప్రభావమో..లేక వైసీపీ అధినేతే వాస్తవాలను గమనించారో తెలియదు కానీ..సేనాని జోలికి మాత్రం వెళ్లడం లేదంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చేవారు వైసీపీ నేతలు. జగన్‌తో సహా ఆయన మౌత్‌ పీస్‌లుగా ఉన్న నేతలంతా..సేనానిని గట్టిగా అటాక్ చేసేవారు. పవన్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని..చంద్రబాబుకు దత్తపుత్రుడని విమర్శించేవారు. అలా పవన్‌ను ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తనదే అధికారమనే భావనలో ఉండేవారట వైసీపీ లీడర్లు.

సేనాని సెగ ఏంటో తెలిసి వచ్చిందప్పుడే..
అందుకే అప్పుడు ఎక్కడికి వెళ్లినా పవన్‌పై పర్సనల్‌ అటాకింగ్‌ చేసేవారని అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా జనసేనానినే టార్గెట్‌ చేసేవారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సేనాని సెగ ఏంటో తెలిసి వచ్చిందంటున్నారు. పవన్‌పై ఎక్కుపెట్టిన బాణాలు మిస్ ఫైర్ అయ్యాయనే అభిప్రాయానికి వచ్చారట.

అందుకే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌పై విమర్శలు తగ్గించి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌నే టార్గెట్‌ చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో పవన్‌ను ఎక్కువగా టార్గెట్ చేయడం వల్లే తమకు తీవ్ర నష్టం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుందట. ఆ కారణంగానే జగన్‌ తన స్వరాన్ని సవరించారన్న టాక్ వినిపిస్తోంది.

పవన్‌, చంద్రబాబును విడదీసి పాలిటిక్స్‌ ప్లే చేయాలనుకున్నారట. కానీ వైసీపీ ఎత్తులు తలకిందులు అవ్వడమే కాకుండా పవన్, చంద్రబాబు మధ్య బంధం మరింత బలపడింది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి తాను మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ అండ్ కో స్కెచ్‌ అనుకునేవారట. అందుకే చంద్రబాబు కన్నా ఎక్కువగా పవన్ వెంట పడేవారట.

కానీ జగన్ అంచనాకు భిన్నంగా ఆ ఇద్దరూ ఒక్కటవ్వడంతో అధికారం వైసీపీ చేతుల నుంచి జారిపోయిందంటున్నారు. ఎన్నికల తర్వాత కార్యకర్తలు, పలువురు నేతలతో పలుమార్లు మాట్లాడిన జగన్..పవన్ విషయంలో విమర్శల డోస్‌ ఎక్కువైందన్న విషయాన్ని గ్రహించారట. అందుకే ఇప్పుడు ఆయన జోలికి వెళ్లకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు విజయవాడ సబ్‌జైలుకు వెళ్లిన జగన్..మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌పైనే తీవ్ర విమర్శలు చేశారు. అరగంటసేపు మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ను ఒక్కమాట కూడా ఆడలేదు. ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా వేయలేదన్న చర్చ జరుగుతోంది. ఇది జగన్‌లో మారిన వైఖరికి ఎగ్జాంమ్‌పుల్ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్‌ను రెచ్చగొడితే నష్టమే ఎక్కువ?
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని, పవన్‌ను రెచ్చగొడితే రాజకీయంగా జరిగే లాభం కన్నా, నష్టమే ఎక్కువగా ఉంటోందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ అధినేతకు చెప్పి..పవన్ విషయంలో సాఫ్ట్‌గా మాట్లాడాలని..అవసరమతే ఆయన ప్రస్తావన తేకపోవడమే బెటరని సూచించినట్లు తెలుస్తోంది. తమ సూచనతో జగన్ రూట్ మార్చారని పలువురు వైసీపీ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు.

జగన్‌ మద్దతుదారులుగా ఉన్నవారు కూడా పవన్‌కు అనుకూలంగా జపం చేస్తున్నారు. రేపోమాపో వైసీపీలో చేరబోతున్నారంటున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అయితే ఏపీకి ఆశాకిరణం పవన్ ఒక్కడేనని ఆకాశానికి ఎత్తుతున్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఏది సాధించాలన్న పవన్‌తోనే సాధ్యం అవుతదని చెప్పుకొచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ను తక్కువ అంచనా వేశామని ఒప్పుకున్నారు.

యూత్‌లో పవన్‌కు ఉన్న క్రేజ్‌..కూటమి బంపర్‌ విక్టరీకి ఉపయోగపడిందని కూడా చెప్పేశారు. లాస్ట్‌కు వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి కూడా పవన్‌ పట్ల సాఫ్ట్ వాయిస్ వినిపించారు. ఇలా వైసీపీ అధినేత సన్నిహితులుగా ఉన్నవారంతా పవన్‌ను పొగుడుతున్నారు. జగన్‌ మాత్రం పవన్‌ పేరెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో సేనాని సెగ వైసీపీకి గట్టిగానే తాకిందన్న చర్చ జరుగుతోంది.