Varudu Kalyani: రుషికొండకే ఎందుకు.. లోకేష్ తోడల్లుడు యూనివర్సిటీకి వెళ్ళచ్చు కదా?
వారాహియాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ గాజువాకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు జరిగే సభలో పవన్ ప్రసంగిస్తారు.
![Varudu Kalyani: రుషికొండకే ఎందుకు.. లోకేష్ తోడల్లుడు యూనివర్సిటీకి వెళ్ళచ్చు కదా? Varudu Kalyani: రుషికొండకే ఎందుకు.. లోకేష్ తోడల్లుడు యూనివర్సిటీకి వెళ్ళచ్చు కదా?](https://10tv.in/wp-content/uploads/2023/08/YCP-MLC-Kalyani-and-Pawan-Kalyan.jpg)
YCP MLC Kalyani and Pawan Kalyan
Varudu Kalyani – Pawan Kalyan: ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు జిల్లాల వారిగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుండగా.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో (Varahi Vijaya Yatra) ప్రజల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండురోజుల క్రితం పవన్ వారాహి మూడో విడత యాత్ర విశాఖలో ప్రారంభమైంది.
ఈ క్రమంలో పవన్ రుషికొండలో అక్రమ కట్టడాల విషయంపై (Rushikonda Issue) ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాదు, శనివారం రుషికొండలో పర్యటించారు. అయితే, అనేక ఆంక్షల మధ్య పవన్ కళ్యాణ్ రుషికొండలోని నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలు చాలా పెద్దవని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నగరాన్ని రుషికొండ కాపాడుతుందన్నారు. అలాంటి కొండను తవ్వడం మొదలు పెట్టారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనతో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
![Pawan Kalyan](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/08/Pawan-Kalyan-4.jpg)
Pawan Kalyan
పవన్ వర్సెస్ వైసీపీ..
పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటన వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. పవన్ సీఎం జగన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా వైసీపీ నేతలు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆయనలో విషం, విద్వేషం కనిపించాయని అన్నారు. రుషికొండలో ఏపీటీడీసీ స్థలంలో ప్రభుత్వ నిర్మాణంపై ప్రశ్నించే పవన్ కళ్యాణ్.. ఒక్కసారి ఎదురుగా గీతం యూనివర్శింటీని చూసి ఉంటే బాగుండేదని సూచించారు. లోకేష్ తోడల్లుడు యూనివర్సిటీకి పవన్ వెళ్లొచ్చుకదా? గీతంలో పెద్ద ఎత్తున జరిగిన భూకబ్జాను పవన్ ఎందుకు కనీసం పట్టించుకోలేదు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కోసం కోతిలా పవన్ గెంతుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి రోజాసైతం పవన్ కళ్యాణ్ రుషికొండ విషయంలో ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రుషికొండపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండలపై భవనాలు ఎందుకు కట్టకూడదు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు కొండలపై కట్టినవి కాదా అంటూ అడిగారు. గీతం వర్సిటీ భూములపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన రోజా.. కోర్టు నిబంధనలకు లోబడే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.. కోర్టుల కంటే పవన్ గొప్పవారా అంటూ విమర్శించారు.
![Pawan Kalyan](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/08/Pawan-Kalyan-1-1.jpg)
Pawan Kalyan
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీకు రుషికొండపై ఎందుకు అంత ప్రేమ అంటూ ప్రశ్నించారు. ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా రుషికొండ వెళ్తారు. అయితే, ఎదురుగా లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్సిటీకి వెళ్ళచ్చు కదా అంటూ ప్రశ్నించారు. కొండలపై తుప్పలు కొట్టకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి గణనీయంగా జరిగిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓనమాలు నేర్చుకోవడానికి విశాఖ కావాలి కానీ, విశాఖ అభివృద్ధి చెందకూడదు అని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా వేధించడం వల్లే ఎంపీ విశాఖ నుంచి వెళ్లిపోతానని అన్నారంటూ పవన్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.
Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు..
నేడు గాజువాకలో పవన్ వారాహి యాత్ర ..
వారాహియాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ గాజువాకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పాత గాజువాక జంక్షన్, 60 ఫీట్ రోడ్డులో జరిగే సభలో పవన్ ప్రసంగిస్తారు. అయితే, గాజువాకలో పవన్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఏం మాట్లాడుతారు? మళ్లీ గాజువాక నుంచే పోటీ చేస్తానని ప్రకటిస్తారా? అనే అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సాయంత్రం జరిగే సభలో పవన్ గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంట్ అంశాలను లేవనెత్తనున్నారు.