YS Jagan: అసెంబ్లీ సమావేశాల వేళ వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇకపై..
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలని వైఎస్సార్సీపీ అంటోంది.

వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు.
“అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకున్నా ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నేనింకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను. నాతో పాటు ఉండేవాళ్లు నా వాళ్లు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి” అని జగన్ తెలిపారు.
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ అన్నారు. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని తెలిపారు.
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. అసెంబ్లీలో వైసీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదని చెప్పారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు.
పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని వైసీపీ నేతలు అన్నారు. పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదని జగన్ చెప్పారు. ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
కాగా, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలని వైఎస్సార్సీపీ అంటోంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్నిఆ పార్టీ బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై గళం విప్పేందుకు తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పారు.