ED Raids: వివేకా హత్య కేసులో ED బిగ్ అప్డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది.
Ys vivekananda reddy murder case ed issues official statement searches in hyderabad and kadapa
- వివేకా హత్యపై ఈడీ ప్రకటన
- ఏడు చోట్ల ముమ్మర సోదాలు
- అవినాష్ ఇంట్లో నగదు స్వాధీనం
ED Raids: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. 2019 మార్చి 15న పులివెందులలోని స్వగృహంలో జరిగిన ఈ హత్య కేసును ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తూ, నిందితులపై మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోద చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ఆర్థిక నేరాల నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి విచారణను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, కడప పరిధిలోని ఏడు కీలక ప్రాంతాల్లోని నిందితుల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది.
రూ.40 కోట్ల డీల్ అంశంపై లోతైన దర్యాప్తు:
హత్య కుట్రలో భాగంగా రూ.40 కోట్ల మేర ఆర్ధిక లావాదేవీల డీల్ జరిగినట్లు అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ దృష్టి సారించింది. గతంలో స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలతో పాటు నిందితులు సునీల్ యాదవ్, గంగిరెడ్డి మధ్య జరిగిన ఆర్ధిక మార్పిడి వివరాలను పరిశీలిస్తోంది. తాజాగా జరిపిన సోదాల్లో కీలకమైన నేరపూరిత ఆధారాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అవినాష్ రెడ్డి నివాసంలో నగదు స్వాధీనం:
తాజా దాడుల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన నివాసంలో లెక్కల్లో లేని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంక్ లాకర్ తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. హత్యానంతరం జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ రికార్డులను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
