ATM: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా? ఇకపై ప్రతి ట్రాన్సాక్షన్కు మీకు ఎంత ఛార్జీ పడుతుందంటే?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు ఆర్బీఐ ఈ ఛార్జీలను ఆమోదించింది.

డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎంలలో క్యాష్ తీసుకుని ఖర్చు చేస్తున్నారు. ఏటీఎంల నుంచి పదే పదే డబ్బులు డ్రా చేసే వారికి మే 1 నుంచి మరిన్ని ఛార్జీలు పడనున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపునకు ఆమోదముద్ర వేసింది. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసినా, బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఛార్జీలు పడతాయి.
వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (ఏటీఎంలను నడుపుతున్న ప్రైవేట్ కంపెనీలు) కస్టమర్ల నుంచి లావాదేవీలకు వసూలు చేసే రుసుములను పెంచాలని ప్రతిపాదన చేశారు. ఈ కొత్త ఛార్జీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఈ కొత్త ఛార్జీలు మే1 నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంటాయి.
Also Read: విశాఖ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా వర్షం?
ఛార్జీలు ఇలా..
క్యాష్ విత్ డ్రా ఫీజు: ప్రతి లావాదేవీకి రూ.17- రూ.19 మధ్య
బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీజు: ప్రతి లావాదేవీకి రూ.6 – రూ.7 మధ్య
బ్యాంకు ఖాతాదారులు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు ఐదు లావాదేవీలు, నాన్-మెట్రో ప్రాంతాలలో ఏటీఎంల నుంచి మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. అవి మించితే ఛార్జీ పడుతుంది. మీరు మీ వద్ద ఉన్న బ్యాంకు డెబిట్ కార్డుతో ఇతర బ్యాంకుకు చెందిన ఎటీఎం నుంచి డబ్బు తీసుకుంటే ఈ పై ఛార్జీలు పడతాయి.
వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఫీజులు పెంచాలని కోరడంతో చివరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు ఆర్బీఐ ఈ ఛార్జీలను ఆమోదించింది.
దీని వల్ల చిన్న బ్యాంకులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాటికి మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉంటాయి. అవి ఇతర బ్యాంకుల ఏటీఎం నెట్వర్క్లపై ఎక్కువగా ఆధారపడతాయి.