2000 Rupees Note : ఒక్కరోజే అవకాశం..! రూ. 2 వేల నోట్ల డిపాజిట్కు ముగియనున్న గడువు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.

2000 notes Exchange last date
Rs 2000 Note Exchange : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19న ఈ ప్రకటన వెలువడింది. అయితే, ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ సూచనల మేరకు సెప్టెంబర్ 1 నాటికి దాదాపు రూ.3.32లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు తిరిగొచ్చాయి. అంటే 93శాతం నోట్లు బ్యాంకులకు చేరాయి. హోల్డర్లు తమ రూ.2000 నోట్లను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా డిపాజిట్ చేసుకొనే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. ఇందుకోసం ఒకేసారి రూ. 20వేల పరిమితి విధించింది.
2వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ గడువు విధించింది. అయితే, గడువు నేటి (శనివారం)తో ముగియనుంది. ఆర్బీఐ విధించిన గడువు తీరనున్న నేపథ్యంలో మళ్లీ గడువును పెంచుతుందా? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 1 నాటికి రూ. 24వేల కోట్ల మేర రూ.2వేల నోట్లు ఉన్నాయి. అయితే, గడువు నేటితో ముగియనుండటంతో ఇప్పటి వరకు ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయంపై ఆర్బీఐ స్పష్టంత ఇవ్వలేదు. ఆర్బీఐలోని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాల ప్రకారం.. 2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ సమయం పొడిగించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. అయితే, ఆర్బీఐ మాత్రం 2వేల నోట్ల గడువు పెంపుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు.
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే, 2023 మార్చి 31న రూ. 3.62లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది. సెప్టెంబర్ 1న నాటికి 3.32లక్షల కోట్లు బ్యాంకులకు చేరాయి. వచ్చిన నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగతా 13శాతం వరకు మార్పిడి చేసుకున్నట్లుగా ఆర్బీఐ పేర్కొంది. సెప్టెంబర్ 1 తరువాత ఇంకా 24వేల కోట్ల రూ.2వేల నోట్లు రావాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి, ఎన్ని నోట్లు మార్పిడి చేయబడ్డాయనే విషయంపై ఆర్బీఐ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈరోజు 2వేల నోట్ల విషయంపై ఆర్బీఐ ఏదైనా ప్రకటన చేస్తుందా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.