దోమ తెరచాటున కోట్ల రూపాయల అక్రమ నగదు

తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ తెరల తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడి నుంచి దోమ తెరలను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఏడాదికి రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్నట్లు గుర్తించారు.
శివస్వామి పన్ను ఎగవేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఐటీ అధికారులు నవంబర్ 15 శుక్రవారం నాడు కరూర్ జిల్లాలోని వెణ్నైమలై లో ఉన్న శివస్వామి ఆఫీసులు, రామ్ నగర్ లోని ఇల్లు, దోమతెరల పరిశ్రమలో దాడులు నిర్వహించి సోదాలు చేశారు.
3 రోజుల పాటు సోదాలు నిర్వహించగా… అల్మరాల్లో దాచి పెట్టిన లెక్కలోకి రాని రూ.32 కోట్ల ను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో దొరికిన విలువైన పత్రాల గురించి విచారణ చేస్తున్నారు. చెన్నై, తిరుచ్చి, మధురై, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 20 మంది అధికారులు పాల్గోన్నారు.