Mukesh Ambani Children Salary : ముఖేష్ అంబానీ వారసులకు జీతాల్లేవు.. ఆకాశ్, ఇషా, అనంత్లకు ఫీజు మాత్రమే చెల్లిస్తాం.. రిల్ తీర్మానం..!
Mukesh Ambani Children Salary : ముకేశ్ అంబానీ పిల్లల వేతనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సంచలన తీర్మానం చేసింది. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ముగ్గురికి కంపెనీలో ఎలాంటి వేతనాలు చెల్లించేది ఉండదని రిల్ స్పష్టం చేసింది.
Mukesh Ambani Children Salary : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులైన ఆకాశ్ అంబానీ (Akash Ambani), ఇషా అంబానీ (Isha Ambani), అనంత్ అంబానీ (Anat Ambani)లు ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టారు. అయితే, రిల్ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
అయినప్పటికీ కంపెనీలో వీరికి వేతనాలు చెల్లించేది లేదని రిల్ తీర్మానించింది. అయితే, ఈ అంబానీ వారసులు వేతనం లేకుండానే పనిచేస్తారా? అంటే.. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రమే ముగ్గురికి ఫీజుల రూపంలో చెల్లించనున్నారట.. ఈ మేరకు షేర్ హోల్డర్లకు పంపిన తీర్మానంలో రిల్ స్పష్టం చేసింది.
అంబానీ వారసులకు నో శాలరీ.. ఓన్లీ కమిషన్ :
ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లల్లో ఆకాశ్, ఇషా కవలలు కాగా.. వీరి వయస్సు 31 ఏళ్లు ఉంటుంది. అనంత్ అంబానీ వయస్సు 28 ఏళ్లు, ఈ ముగ్గురు రిల్ కంపెనీ బోర్డ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. బోర్డులోకి అడుగుపెట్టిన సమయంలోనే కంపెనీ నుంచి ఎలాంటి వేతనం తీసుకోకుండా పనిచేస్తామని తీర్మానించుకున్నారని రిల్ పేర్కొంది.
గత నెలలో రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (AGM) జరిగింది. ఆ సమయంలోనే ముఖేశ్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించారు. అయితే, ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అంబానీ వారసులు కొనసాగనున్నారు. ఈ ముగ్గురి నియామకాన్ని ఆమోదించడానికి కంపెనీ షేర్ హోల్డర్లకు తీర్మానం పంపింది. కంపెనీ లాభాల్లో కమిషన్ మాత్రమే అంబానీ పిల్లలకు ఇవ్వనున్నట్టు రిల్ పేర్కొంది.
మరో 5ఏళ్లు ఛైర్మన్గా అంబానీ.. జీతం వద్దు :
ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) కూడా గతంలో రిల్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేశారు. తద్వారా సిట్టింగ్ ఫీజు, కమిషన్ మాత్రమే తీసుకున్నారని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో మరో 5ఏళ్ల పాటు తానే కంపెనీ ఛైర్మన్గా ఉంటానని ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచి అంబానీ వార్షిక వేతనం పొందలేదు. అంతేకాదు.. ఎలాంటి కమిషన్ కూడా తీసుకోవడం లేదు. మరో ఐదేళ్ల పాటు వేతనం వద్దని ఆయన రిల్ బోర్డుకు చెప్పారు. 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో తన వేతనాన్ని అంబానీ ఏడాదికి రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.
అంబానీ పిల్లల కీలక బాధ్యతలివే :
ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ముగ్గురు రిలయన్స్ వివిధ కంపెనీల్లో కొనసాగుతున్నారు. రిలయన్స్ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా ఆకాశ్ అంబానీ ఉండగా.. రిలయన్స్ రిటైల్ బాధ్యతల్లో ఇషా అంబానీ ఉన్నారు. న్యూ ఎనర్జీ సెక్టార్ మెయింటెనెన్స్ బాధ్యతల్లో అనంత్ అంబానీ కొనసాగుతున్నారు.
అంబానీ పిల్లలలో, ఇషా, 31, సైకాలజీ, సౌత్ ఏషియా స్టడీస్లో డబుల్ మేజర్, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏతో యేల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. రిలయన్స్ రిటైల్ సొంత బ్రాండ్ పోర్ట్ఫోలియో విస్తరణలో కొన్ని అద్భుతమైన భారతీయ బ్రాండ్లను కొనుగోలు చేయడం, ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ను ప్రారంభించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఇషా నేరుగా కంపెనీకి చెందిన 0.12 శాతం ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. రిలయన్స్ షేర్లలో అంబానీకి 41.46 శాతం వాటా ఉంది.
అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాష్, భారత అతిపెద్ద టెలికాం కంపెనీ జియోకు అధిపతిగా ఉన్నారు. బ్రౌన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన అనంత్.. రిలయన్స్ పవర్, మెటీరియల్ వ్యాపారాల విస్తరణ, పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీలో ప్రపంచ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. అనంత్ నాయకత్వంలో, రిలయన్స్ 2035 నాటికి నికర కార్బన్ జీరో కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆకాష్, ఇషా అక్టోబర్ 2014 నుంచి జియో, రిలయన్స్ రిటైల్ రెండింటికీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతున్నారు. కొత్త ఎనర్జీ బిజినెస్లకు హెల్మింగ్ చేసే సంస్థల బోర్డులలో ఉండటంతో పాటు, అనంత్ రిటైల్, జియో బోర్డులలో కూడా కొనసాగుతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో ఇషా డైరెక్టర్గా నియమితులయ్యారు.