ఆ రైల్వే స్టేషన్ రోజు ఆదాయం రూ. 20

ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది. సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజర్ రైళ్లు అక్కడ ఆగుతాయి. ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరుస్తాయి.
రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ లో దాని నిర్వహణకు అయ్యే ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలు చూసుకున్నా కనీసం నెలకు 3లక్షల రూపాయలైనా అవుతుంది. వాణిజ్యపరంగాఆలోచిస్తే అంతకంటే రెట్టింపు ఆదాయం ఆ రైల్వే స్టేషన్ వల్ల రావాలి. కాగా కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ ఎంత ఆదాయం గడిస్తోందో అందరికీ తెలిసిన విషయమే…. రైల్వే బడ్జెట్ లో సదరు మంత్రిగారు వివరిస్తారు.
కానీ… ఒడిషాలోని ఓ రైల్వే స్టేషన్ రోజు వారి ఆదాయం ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లెబెడతారు. అదెక్కడ అంటారా…….ఒడిశాలోని బొలంగిర్ జిల్లాలో బిచ్చుపాలి రైల్వేస్టేషన్కు వస్తున్న ఆదాయం రోజుకు అక్షరాలా రూ.20 మాత్రమే. ఇద్దరంటే ఇద్దరే ప్రయాణికులు ఆ రైల్వే స్టేషన్ నుంచి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. బొలాంగిర్-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్ నిర్మించారు. గతేడాది జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించారు.
ఎప్పుడు చూసినా రైల్వే స్టేషన్ ఖాళీగా కనిపిస్తుండటంతో అసలు ఈ రైల్వేస్టేషన్ ఆదాయమెంత అంటూ బొలాంగిర్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం తెలుసుకుని బయట పెట్టారు. దీనికి సంబల్పూర్ డివిజన్ అధికారులు ఇచ్చిన సమాధానంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. సోనేపూర్ రైల్వేలైన్కు దీన్ని కనెక్ట్ చేస్తే ఈ స్టేషన్ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్కోస్ట్ రైల్వే చీఫ్, పబ్లిక్ రిలేషన్ అధికారి జేపీ మిశ్రా తెలిపారు.