ప్రియుడితో లేచిపోయేందుకు కిడ్నాప్ డ్రామా… ధ్రిల్లర్ సినిమాను మరిపించింది

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 09:14 AM IST
ప్రియుడితో లేచిపోయేందుకు కిడ్నాప్ డ్రామా… ధ్రిల్లర్ సినిమాను మరిపించింది

Updated On : June 26, 2021 / 11:40 AM IST

ప్రేమలో పడిన 19 ఏళ్ల అమ్మాయి తండ్రి నుంచి కోటిరూపాయలు కొట్టేయటానికి సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది.  ధ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన డ్రామా ఎపిసోడ్ లో  పోలీసులు రంగంలోకి దిగి విచారించే సరికి ఇందతా నాటకమని తేలటంతో కధ అడ్డం తిరిగింది.

ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా నాగ్లా భజ్నా గ్రామంలో నివసించే 19 ఏళ్ల యువతి ఇంటికి సమీపంలోని యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో పడింది. ఈ సంగతి ఇంట్లో తెలిసి వద్దని వారించి ఆమెను కట్టడి చేశారు. దీంతో ప్రేయసి ప్రియులిద్దరూ కలిసి  పారిపోయేందుకు  కిడ్నాప్ డ్రామా ఆడారు.

ప్లాన్ లో భాగంగా  గురువారం, జులై 23న  ఆ  యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వేరే సెల్ ఫోన్ నెంబరు నుంచి తల్లి తండ్రులకు ఫోన్ చేసి తాను కిడ్నాప్ అయినట్లు చెప్పింది. ఆమె దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న కిడ్నాపర్ మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు.

దీంతో తల్లి తండ్రులకు దిక్కు తోచలేదు. ఆందోళన చెందారు. వారు పోలీసులను ఆశ్రయించారు. కోటి రూపాయలు డిమాండ్ చేశారంటే ఇందులో ప్రొఫెషనల్ కిడ్నాపర్ల హస్తం ఉండి ఉంటుందనే ఆలోచనతో పెద్ద ఎత్తున సిబ్బందిని కేటాయించి వెంటనే విచారణ ప్రారంభించారు.

కిడ్నాప్ డ్రామా రక్తి కట్టేందుకు యువతి పలు సార్లు ఫోన్ చేయటం మొదలెట్టింది. వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. సదరు యువతి ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేశారు. ఆ నెంబరు వారి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి యువతిని అరెస్ట్ చేశారు.

పోలీసులుదాడిలో ప్రియుడు తప్పించుకు పారిపోయాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ రాహుల్ కుమార్ వెల్లడించారు. తండ్రి కోటి రూపాయలతో స్కూల్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకుని … ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో పారిపోయి జీవించాలనుకుని ఈ కిడ్నాప్ డ్రామా అడినట్లు పోలీసు విచారణలో వెల్లడించింది.