బాణాసంచా కర్మాగారంలో పేలుడు : ఆరుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లోని మిరేచి పట్టణంలో శనివారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి పట్టణంలోని టాకియా ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అనుమతులు లేకుండా ఈ భవనంలో బాణాసంచా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. శిధిలమైన భవనం కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.