అతడి ఆచూకీ చెబితే.. రివార్డుగా రూ.10 లక్షల క్యాష్

అతడి గురించి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని NIA కోరింది. సరైన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.

అతడి ఆచూకీ చెబితే.. రివార్డుగా రూ.10 లక్షల క్యాష్

Rameshwaram cafe blast NIA announces cash reward

Rameshwaram cafe blast: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో ఈనెల 1న జరిగిన బాంబు తీవ్ర భయాందోళన రేపింది. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. మరోవైపు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన వ్యక్తి కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అతడి గురించి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని NIA కోరింది. సరైన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీయిచ్చింది.

మార్చి 1వ తారీఖున మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. టోపీ, మాస్క్, కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి బాంబు పెట్టినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అతడు పట్టుబడలేదు. దీంతో NIA రివార్డు ప్రకటించింది.

Also Read: నీటి ఎద్దడితో బెంగళూరు వాసులు విలవిల.. తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు

దుండగుడిని పట్టుకునేందుకు 8 టీమ్‌ల‌ను రంగంలోకి దించినట్టు కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర అంతకుముందు తెలిపారు. “అనుమానితుడు బస్సులో వచ్చాడన్న సమాచారం ఆధారంగా.. ఆ సమయంలో ఈ మార్గం గుండా వెళ్లిన 26 బస్సులను పోలీసులు తనిఖీలు చేశారు. దుండగుడు ప్రయాణించిన బస్సును కనిపెట్టగలిగాం. అయితే అతడు టోపీ, మాస్క్, కళ్లజోడు పెట్టుకోవడంతో గుర్తించడం కష్టంగా మారింద”ని అన్నారు. అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో NIA విచారణ ప్రారంభించింది.