డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదు : ఎక్సైజ్ శాఖ

టాలీవుడ్ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్చిట్ ఇవ్వలేదన్నారు. డ్రగ్స్ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛార్జి షీట్లో సైతం బలమైన అంశాలను పొందుపరచలేదంటూ మీడియాలో నిన్న విస్తృతంగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
సినీ తారలకు క్లీన్చిట్ ఇచ్చారన్న వార్తల్ని కొట్టిపారేశారు అధికారులు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలు చేసి కోర్టుకు సమర్పిస్తున్నాం.. తప్ప ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని.. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.