మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
జార్ఖండ్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో కొంతమంది గత కొంతకాలంగా పోలీసులకు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారని తెలుస్తోంది. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ కు చెందిన సుధాకర్ అలియాస్ కిరణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో సుధాకర్ క్రియాశీలక పాత్ర పోషించారు. సుధాకర్, భార్య మాధవి 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో సుధాకర్ చురుకుగా పాల్గొన్నాడు. అనేక ఎన్ కౌంటర్లలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కూడా వారిపై కేసులు ఉండటం వల్ల ఇక్కడి తీసుకొచ్చి వారిని విచారించే అవకాశం ఉంది. అయితే విచారణ నిమిత్తం వారిని తెలంగాణకు పంపే విషయంలో జార్ఖండ్ పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. పోలీసులకు లొంగిపోయారు కాబట్టి వారిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసే అవకాశం ఉంది. ఫిభ్రవరి 12 మంగళవారం మీడియా సమావేశం అనంతరం పోలీసులు పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది.