ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా..

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి

Private Travels Bus Overturned : హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్ సాయంతో సిబ్బంది బస్సును తొలగిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతివేగంగా వెళ్లిన బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. బస్సులో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరిని బయటకు తీశారు. రోడ్డుపై బోల్తా పడిన బస్సును.. క్రేన్ సాయంతో పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా వెళ్తున్న బస్సు బోల్తా కొట్టడంతో కిటికీలోంచి పడి బస్సు చక్రాల కింద నలిగి ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ