స్మార్ట్ఫోన్తోనే వ్యాపారం : ఒంటరి మహిళలు, కాలేజీ యువతులతో వ్యభిచారం

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీ కోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచారముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో ఇటీవల హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారాన్ని నిర్వాహకులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో పెద్ద మనుషుల్లా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలతో కాలేజీ యువతులను … వివాహితలను ఈ ఊబిలోకి లాగుతున్నట్లు తెలిసింది. మొదట సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారి స్ధితి గతులు తెలుసుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ప్రవేశం
ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ నిత్యావసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో ఫేస్బుక్, టిక్టాక్, హలో, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్ లు అందరూ ఉపయోగిస్తున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ చేసుకుని చాటింగ్లు మొదలు పెడుతున్నారు.
వీరితో పరిచయం పెరిగి కాల్స్ చేయటం మొదలెట్టి , లైవ్ కాల్స్కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు చూపిస్తామని అందుకోసం ఫోన్ చేయాలని వారికి వల వేయడం జరుగుతోంది.
స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. అలా మెల్లమెల్లగా వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. (తన వద్దకు రావాలని వేధిస్తున్న వివాహిత : పోలీసులను ఆశ్రయించిన బాధితుడు)
డేటింగ్ యాప్ ల ద్వారా వ్యాపారం
వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్ యాప్లోకి అడ్మిట్ చేయిస్తారు. డేటింగ్ యాప్స్లో ముఖ్యమైన ఇన్స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్ యాప్( రెడీ టూ మీట్ న్యూగర్ల్స్ ఫ్రం యువర్ ఏరియా), జస్ట్ ఫ్రెండ్స్, క్వాక్ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్చాట్, విగో, టిండర్, క్రస్లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైవ్ కాల్స్ నుంచి డైరెక్ట్గా మీటింగులు నిర్వహిస్తుంటారు.
వీరి ఉచ్చులో చిక్కుకుని వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు.
పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
పలమనేరు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మార్చినట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను తిప్పుతున్నారుట.
ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని స్ధానికులు కోరుతున్నారు.