Road Accident : సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి
సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం వద్ద సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident on Suryapet National Highway : సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం వద్ద సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను మధిర డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. మృతులు మునగాల మండలం రామసముంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. మోతె మండలం బుర్కచర్లలో మిరప తోటలో పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read : Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. హరిహర వీరమల్లు దర్శకుడు కూడా..
ప్రమాదంలో క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కందుల నాగమ్మ, చెరుకు నారాయణమ్మ, పోకల అనసూయమ్మలుగా గుర్తించారు. మోతె మండల కేంద్రంలో కేశవపురం – మోతె గ్రామ అండర్ పాస్ క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.
Also Read : Mali Bus Accident : మాలిలో వంతెన పైనుంచి పడిపోయిన బస్సు.. 31మంది మృతి
సూర్యాపేట సమీపంలోని మోతే వద్ద మధిర డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఆటో ప్రమాదానికి గురికావడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 53 మంది ప్రయాణీకులు ఉండగా ఆటోలో 14 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందటం తీవ్రంగా కలిచివేసిందని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పిన పొన్నం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.