ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త : 11వేల 500 పోస్టులు భర్తీ

ఏపీలోని నిరుద్యోగులు త్వరలో మరో భారీ శుభవార్త విననున్నారు. పోలీస్ శాఖలో ఏకంగా 11వేల 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. డిపార్ట్ మెంట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11,500 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది పోలీసు నియామక మండలి. వీటిలో 340 సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి.
2020 జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో ఖాళీల వివరాలను పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి ఇచ్చింది.
2018లో 3 వేల ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. ఈ నియామక ప్రక్రియ పూర్తి కావడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై పోలీసు నియామక మండలి దృష్టి పెట్టింది. జగన్ సీఎం అయ్యాక పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు.
జూన్ 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 30 శాతం సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు అవవసరమైన ఖాళీల భర్తీకి పోలీసుశాఖ సన్నాహాలు చేస్తోంది. దశలవారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.