దేశంలో కరోనా సోకకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు

  • Published By: chvmurthy ,Published On : March 3, 2020 / 04:58 PM IST
దేశంలో కరోనా సోకకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు

Updated On : March 3, 2020 / 4:58 PM IST

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్యలు చేపట్టింది. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై కఠిన అంక్షలు విధిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది.

మార్చి 3వ తేదీకి ముందు ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశస్థులకు జారీచేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. 

చైనా దేశీయులకు ఫిబ్రవరి 5కు ముందు  వరకు జారీచేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రం. ఆ నిర్ణయం ఇంకా కొనసాగుతుందని కొత్త నిబంధనల్లో వెల్లడించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. 

ఫిబ్రవరి 1 తర్వాత చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణ  కొరియా, జపాన్‌ దేశాలకు వెళ్లిన విదేశీయుల రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ జాబితాలో ఎవరైనా అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.

పైన పేర్కొన్న దేశాలకు చెందిన దౌత్యవేత్తలకు, ఐకరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులకు, ఓసీఐ కార్డుదారులకు, విమాన సిబ్బందికి అంక్షల నుంచి మినహాయింపు కల్పించింది. అయితే వారికి ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్‌ తప్పనిసరని పేర్కొంది. 

అంతర్జాతీయ విమనాల ద్వారా భారత్‌లోకి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో సరైన వివరాలతో కూడిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. భారత్‌లో నివసించే అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌తో కూడిన పూర్తి సమచారాన్ని అందులో పొందు పరచాలి. అలాగే ట్రావెల్‌ హిస్టరీ వివరాలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సమర్పించాలి.

చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, ఇరాన్‌, ఇటలీ, హాంకాంగ్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, తైవాన్‌ నుంచి నేరుగా కానీ, ఇతర ప్రదేశాల్లో పర్యటించి గానీ ఇండియాలోకి వచ్చే ప్రయాణికులు (భారతీయులు, విదేశీయులు) ఎయిర్‌పోర్ట్‌ లోకి అడుగుపెట్టగానే స్క్రీనింగ్‌ చేయించుకోవాలని తెలిపింది. 

చైనా, ఇరాన్‌, కొరియా, ఇటలీల వెళ్లకుండా ఉండాలని భారతీయులకు సూచించింది. అలాగే కోవిడ్‌-19 ప్రభావిత ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది.