ఇంటర్ గ్లోబరీనా తప్పులివే : త్రిసభ్య కమిటీ సూచనలు
గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు కారణమని తేలింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్ అవ్వడం ఖాయమని ముందే తెలిసినా… ఇంటర్ బోర్డు కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. లక్షలాది మంది బాల బాలికల భవితవ్యాన్ని గాలికొదిలేసింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన బోర్డు అధికారులు, గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పులనూ త్రిసభ్య కమిటీ గుర్తించింది. అంతేగాకుండా భవిష్యత్లో తప్పులు జరగకుండా ఉండేందుకు పలు సూచనలు చేసింది కమిటీ.
తప్పులు : –
– గతేడాది జరిగిన తప్పిదాలను ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్థకు వివరించినా అది విస్మరించింది.
– ఇంటర్ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలం.
– డేటా మైగ్రేషన్, మొబైల్ యాప్కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్లైన్ సర్వీసు, అడ్మిషన్ మాడ్యూల్, పరీక్షా కేంద్రాల నిర్వహణ, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ చేయాలి. కానీ ఇవేమీ చేయలేదు.
– 531 మంది మెమోల్లో జాగ్రఫీ సబ్జెక్టులో ప్రాక్టికల్ మార్కులు కనిపించలేదు.
– 436 మంది మెమోల్లో తెలంగాణకు బదులు ఏపీ అని ముద్రించారు.
– కొంతమంది విద్యార్థుల మెమోల్లో మార్కుల స్థానంలో AF అనే అక్షరాలు వచ్చాయి.
– 4,288 మంది MEC విద్యార్థుల మెమోల్లో మ్యాథ్స్ సబ్జెక్టు దగ్గర సింగిల్ డిజిట్ మార్కులు కనిపించాయి.
* ఫలితాల వెల్లడిలో మానవ వనరుల తప్పిదాలు సున్నాశాతం ఉండేలా చూడాలి.
* ఫస్టియర్లో 80శాతం మార్కులు సాధించి.. సెకండ్ ఇయర్లో ఫెయిలైన విద్యార్థులకు ఇంటర్ బోర్డే రీవెరిఫికేషన్ చేయాలి.
* సర్వర్ స్థాయిని పెంచాలి.
* సందేహాల నివృత్తికి ఐవీఆర్ సర్వీస్, బోర్డు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
* ఎస్ఎమ్మెస్ అలర్ట్, ఈ మెయిల్ అలర్ట్ విధానాన్ని తీసుకరావాలి.
* విద్యార్థులకు ఎకనాలెడ్జ్మెంట్ పంపేలా చర్యలు తీసుకోవాలి.
* రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగించడానికి ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఏజెన్సీని ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యంకాదు కాబట్టి.. తోడుగా స్వతంత్రంగా వ్యవహరించే మరొక ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వాలి. అని త్రిసభ్య కమిటీ సూచించింది.