ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.

టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. శనివారం (అక్టోబర్ 26, 2019) ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వాసుదేవరావు, వీఎస్ రావు చర్చలకు హాజరయ్యారు. కాగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల కోసం 16 మంది జేఏసీ నేతలు రాగా ఆర్టీసీ ఎండీ నలుగురు నేతలను మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. మిగతా వారికి అనుమతి లేదంటూ పోలీసులు గేటు దగ్గరే ఆపేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన 22 రోజుల తర్వాత తొలిసారి ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ సమస్యలపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ స్టడీ చేసి నివేదికను సంస్థ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మకు అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఉదయం సమర్పించింది. దీనిని రవాణ శాఖ మంత్రికి అందచేశారు. ప్రగతి భవన్కు వెళ్లి సీఎం కేసీఆర్కు మంత్రి నివేదిక అందించారు. మొత్తంగా చర్చలకు సీఎం కీసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారం లేని అంశాలపై సంఘాలతో చర్చలు జరుపాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఆర్టీసీ సమ్మె 22వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు పట్టుదలకు వెళ్లడంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి. అయితే ఆర్టీసీ విలీన అంశమే పీఠముడిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరుపక్షాలు ఎవరి పట్టుదలలో వారున్న క్రమంలో జరుగనున్న చర్చల్లో ఎలాంటి పురోగతి సాధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చర్చలు పూర్తిస్థాయిలోజరుగుతాయా? లేదంటే… కోర్టు సూచించినట్లుగా 21 అంశాలపైనే జరుగుతాయా అనేది ఉత్కంఠగా ఉంది.