నరసారావు పేటలో 144సెక్షన్: కెన్యా నుంచి బయల్దేరిన కొడుకు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడంతో కోడెల సొంత నియోజకవర్గం నరసారావు పేటలో ఇవాళ(16 సెప్టెంబర్ 2019) నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆ పట్టణంలోని అతిధి గృహాల వైపు రహదారులు, రైతు బజారు వెళ్లే దారులు, పట్టణంలో ఎక్కడ కూడా ఐదుగురు కంటే ఎక్కువ జనం కనిపించకూడదని ఉత్తర్వులు జారీచేశారు పోలీసులు.
ఆర్ డీఓ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం.. ఎక్కువ మంది చేరి అనవసరంగా సమస్యలు సృష్టించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. కోడెల మృతితో నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు హై అలర్డ్ ప్రకటించారు. రేపు ఉదయం గుంటూరు జిల్లా కండ్లగుంటలో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.
కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం కెన్యా నుంచి బయల్దేరారు. రేపటికి ఆయన గుంటూరు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. అయితే 144సెక్షన్ ప్రకటించిన క్రమంలో అంతిమ యాత్ర జరగనుందా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.