తెలంగాణ పంచాయితీ ఎన్నికలు : హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్నికలను ఆపలేమని హై కోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ను నిలిపివేయలేమని హై కోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ ను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినందున ఎన్నికల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేసిన బీసీ జాతీయ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు చుక్కెదురైంది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కృష్ణయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్ తగ్గింపు వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.