బాబోయ్ చలి : హైదరాబాద్లో @ 9 డిగ్రీలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో జంటనగరాల్లో 9.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంతో పోలిస్తే ఆరు డిగ్రీలు మైనస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరంలో సాయంత్రం ఆరు గంటల నుండే రోడ్లపై జనసామర్థ్యం తగ్గిపోయింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందిపడుతున్నారు. మరో ఐదు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వికారాబాద్లో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సంగారెడ్డిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీలు, వికారాబాద్లో 5.5 డిగ్రీలు, సంగారెడ్డిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు.
వివిధ జిల్లాల్లో…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానూ చలి వణికిస్తోంది. సాయంత్రం ఐదు అయిందంటే బయటకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. గ్రామాల్లో చలి తీవ్రత రెండు నుంచి మూడు డిగ్రీలకు పడిపోయింది. పట్టణ కేంద్రాల్లో 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ త్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.