ఆ అదృష్టవంతులు ఎవరు : పదవుల కోసం టీఆర్ఎస్ నేతల పాట్లు

హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతలంతా పదవుల పందేరంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనున్న తరుణంలో పదవులు

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 12:54 PM IST
ఆ అదృష్టవంతులు ఎవరు : పదవుల కోసం టీఆర్ఎస్ నేతల పాట్లు

Updated On : February 14, 2019 / 12:54 PM IST

హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతలంతా పదవుల పందేరంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనున్న తరుణంలో పదవులు

హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతలంతా పదవుల పందేరంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనున్న తరుణంలో పదవులు దక్కించుకునేందుకు నేతలంతా ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కేబినెట్‌ విస్తరణ సహా ఏ పదవులు కూడా కేటాయించలేదు. కొన్ని రోజులుగా కేబినెట్‌ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఇంకా ఆ ప్రక్రియ ఆలస్యమవుతూనే ఉంది. అయితే.. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుందనే ఆశాభావం నేతల్లో కనిపిస్తోంది.

 

మంత్రివర్గ విస్తరణ తర్వాతే.. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 18 నుంచి కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంఘం రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనుంది. 21వ తేదీ తర్వాత బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడైనా జరగొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాతే మండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. దీంతో త్వరలోనే కేసీఆర్‌ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు నేతలను ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో నేతలంతా పార్టీ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు కేబినెట్‌లో బెర్తు దక్కించుకునేందుకు యత్నిస్తుండగా.. ఓటమి చెందిన నేతలతో పాటు సీనియర్లు ఆ ఇద్దరి దృష్టిలో పడితే ఏదో ఒక పదవి దక్కకపోతుందా అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం వారిద్దరి దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారు. యువనేత కేటీఆర్‌ నేతల తాకిడిని భరించలేక తెలంగాణ భవన్‌కు రావడం లేదన్న గుసగుసలు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి.

 

ఇదిలావుంటే కేబినెట్‌ విస్తరణ జరిగిన వెంటనే.. 16మంది నేతలకు మండలి పదవులు దక్కనున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ మండలి నియోజకవర్గాలకు పాత అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, గవర్నర్‌ కోటాలో మండలికి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ఇవన్నీ త్వరలోనే భర్తీ అవుతాయని తెలుస్తోంది. దీంతో పలువురు నేతలు ఎప్పుడెప్పుడు తమకు పదవులు దక్కుతాయా అని ఎదురుచూస్తున్నారు.

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

Also Read :  బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే