టీవీ9 రవిప్రకాశ్ కేసులో కీలకమైన వ్యవహారాలు ఇవే

టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి మొదలుపెట్టాయి. ABCL కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్గా హోదా పొందిన రవిప్రకాశ్ అసోసియేట్స్కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.
ABCLలో 90 శాతానికి పైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 24, 25 తేదీలలో డబ్బు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ABCL యాజమాన్యం అలందా చేతికి మారిపోయింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ.. ABCL కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది.
సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేసింది. ABCL యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ABCL డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ABCL సంస్థ అక్టోబర్ 23, 2018న ఓసారి, జనవరి 30, 2019న మరోసారి డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో తీర్మానం చేసింది. అనంతరం ABCL కంపెనీ చేసిన తీర్మానాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపింది. ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ABCL డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ABCLకు సమాచారం ఇచ్చింది.
అయితే అన్నీ అనుమతులు తీసుకున్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్కు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ABCLలో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియా నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయ్యాలని బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు.
రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టింరాని తెలిపారు.
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు ABCLలో కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను ఆమోదించారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్గా తీసుకున్న యాజమాన్యం రవిప్రకాశ్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త యాజమాన్యం చేతిలో 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి చట్టప్రకారం వారికే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నిర్వహణ బాధ్యతలను కొత్త యాజమాన్యం చేపట్టింది.
ABCL యాజమాన్యం మార్పును, కొత్త డైరెక్టర్ల నియామకాన్నీ అడ్డుకునేందుకు రవిప్రకాశ్ అడ్డదారులు తొక్కుతూ శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన మరికొన్ని అక్రమాలపై కూడా అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో, సినీ నటుడు శొంఠినేని శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడం. సంస్థ యాజమాన్యానికి… కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కలుగజేసేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించారని, ఆ తస్కరించిన డేటాను బయటి వ్యక్తులకు చేరవేశారనే అనుమానాలు ఉన్నాయి.