ఏం కొనాలి..ఏం తినాలి : ఉల్లి రూ. 60..టమాట రూ. 10

ఉల్లి ఘాటు ఎక్కిస్తుంటే..టమాట తీపి ఎక్కిస్తోంది. అవును..మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ రూ. 60 పలుకుతుంటే..టమాట కిలో రూ. 10కి పడిపోయింది. మిగతా కూరగాయాల ధరలు మాత్రం దిగిరానంటున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వారి జేబులు గుల్లవుతున్నాయి.
ఆరు నెలల క్రితం హోల్ సేల్ కిలో రూ. 10 పలికిన ఉల్లిగడ్డలు..ఇప్పుడు రూ. 50 నుంచి రూ. 55 పలుకుతున్నాయి. ఇక రిటైల్లో రూ. 60 వరకు ఉంది. మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి దిగుమతులు తగ్గుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 20 టన్నుల ఉల్లిగడ్డ దిగుమతి కావాల్సి ఉంటే..ప్రస్తుతం 8 టన్నులు మాత్రమే వస్తోందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.
ఆకుకూరలు కూడా అదే బాటలో పోతానంటున్నాయి. పది రూపాయలిస్తే..మూడు పాలకూర కట్టలు బ్యాగులో వేస్తున్నారంటున్నారు వినియోగదారులు. కూరగాయల ధరలు అమాంతం పెరుగుతుండడంతో కొనుక్కోలేకపోతున్నామని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు రూ. 100 తీసుకెళితే..తక్కువగానే కూరగాయాలు వస్తున్నాయంటున్నారు.
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. రైతులందరీ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు. నగర మార్కెట్లకు డిమాండ్ సరిపడా కూరగాయాల దిగుబడి లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.