కరోనా లాక్డౌన్లో బిలియనీర్లు 35 శాతం అదనంగా సంపాదించారు!!
Lockdown Income: కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విధించిన లాక్డౌన్ సంపన్నులకు మాత్రమే కలిసొచ్చింది. లాక్డౌన్ సమయంలో కొందరు ఉద్యోగాలు కోల్పోతే భారత్లో బిలియనీర్లు 35 శాతం మరింత ధనవంతులయ్యారు. ఇదంతా ఇంటర్నేషనల్ ఎన్జీవో ఆక్స్ఫామ్ డేటా ప్రకారం.. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎనకామిక్ ఫోరమ్ కాన్ఫిరెన్స్లో ఆక్స్ఫామ్ తన రిపోర్ట్ను ప్రవేశపెట్టనున్నది. ద ఇన్క్వాలిటీ వైరస్ టైటిల్తో రిపోర్టు రెడీ చేశారు.
84 శాతం కుటుంబాలు ఆదాయం కోల్పోగా.. గతేడాది ఏప్రిల్లో మాత్రం గంటకు సుమారు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్లోని టాప్ 100 మంది బిలియనీర్ల ఆదాయం బాగా పెరిగినట్లు ఆక్స్ఫామ్ చెప్పింది. బిలియనీర్ల ఆదాయం ఎంత పెరిగిందంటే 138 మిలియన్ల పేదలకు ఒక్కొక్కరికి రూ.94 వేల చెక్ ఇవ్వొచ్చు అని ఆ సంస్థ పేర్కొంది.
అంబానీ సంపాదన..
మహమ్మారి సమయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ గంటలో సంపాదించిన మొత్తాన్ని.. నైపుణ్యం లేని సాధారణ కార్మికుడు కనీసం 10 వేల ఏళ్లు కష్టపడితే కానీ సంపాదించలేడని పేర్కొన్నారు. అదే ఓ సెకనులో సంపాదించిన మొత్తాన్ని ఆర్జించాలంటే సామాన్యుడికి మూడేళ్లు పడుతుందని ఆక్స్ఫామ్ పేర్కొంది. ఆగస్టులోనే ప్రపంచంలో అత్యంత నాలుగో సంపన్న వ్యక్తిగా అంబానీ రికార్డుకెక్కారు. ఒకవేళ దేశంలోని 11 మంది బిలియనీర్లు తమ సంపాదనలో ఒక శాతం ట్యాక్సు కట్టినా.. ఆ మొత్తంతో జన ఔషధీ స్కీమ్కు నాణ్యమైన మందులు అందివ్వొచ్చు అని రిపోర్ట్ చెప్పింది.
శాలరీలు పెంచాలి..
అసమానతలు తగ్గేందుకు ఆక్స్ఫామ్ కొన్ని సలహాలు ఇచ్చింది. క్రమబద్దంగా ఈ చర్యలు తీసుకోవాలని.. 50 లక్షల కన్నా ఎక్కువ సంపాదించిన వారిపై 2 శాతం సర్చార్జ్ విధించాలని చెప్పింది. మహమ్మారి వల్ల అధిక స్థాయిలో ఆదాయం ఆర్జించిన కంపెనీలపై టెంపరరీ ట్యాక్స్ విధించాలని తెలిపింది.