చైనా కోసం ఉంచిన పరికరమే ఉత్తరాఖాండ్ బీభత్సానికి కారణం!!

Uttarakhand: ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలపై మరొకరి ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్ ఎంఎస్ కోహ్లి 1965లో ఆ హిమానీనదంపై ఉంచిన రేడియో యాక్టివ్ పరికరం కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 1964లో చైనా.. షిన్జియాంగ్ ప్రావిన్స్లో అణు బాంబును పరీక్షించింది. అప్పట్లో పశ్చిమ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. చైనాకు ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదని వాళ్ల అంచనా.
తర్వాతి రోజుల్లో చైనా మరిన్ని అణు పరీక్షలు నిర్వహిస్తే పసిగట్టడానికి వీలుగా 1965లో అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్)తో కూడిన బృందం నందా దేవి హిమానీనదంపై రేడియో ధార్మిక పరికరాన్ని ఉంచింది. ఈ పరికరానికి ప్లుటోనియం క్యాప్సూల్స్ నుంచి శక్తి అందేలా ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్లవరకూ శక్తిని వెలువరిస్తూనే ఉంటాయి. ఈ పరికరాన్ని అప్పట్లో ఉంచిన టీంలో ఎంఎస్ కోహ్లి కూడా ఉన్నారు. తాజా ఘటనకు ఈ పరికరమే కారణమై ఉండొచ్చని అంటున్నారు.
‘దాన్ని మనం కొట్టిపారేయలేం. దిగువ భాగానికి చేరి ఉంటుంది. దాన్ని వెతికేందుకు సీనియర్ శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. గాలింపు కోసం ఆధునిక మెటల్ డిటెక్టర్లను ఉపయోగించాలి. 25 వేల అడుగుల ఎత్తులో ఉన్న నందా దేవి శిఖరాగ్రానికి ఆ పరికరాన్ని తీసుకెళుతుండగా మార్గమధ్యంలో వాతావరణం ప్రమాదకరంగా మారిపోయింది. ఉధృతమైన గాలుల ధాటికి ముందడుగు వేయలేకపోయాం. ఆ పరికరాన్ని కిందకు ఈడ్చుకొచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాం. మంచులో గుంత తవ్వి అందులో ఉంచాం. తర్వాత మళ్లీ అక్కడి నుంచి నందాదేవి శిఖరంపైకి చేర్చాలనుకున్నాం. 1966లో తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లాం.
ఆ పరికరంలోని అణుశక్తి జనరేటర్ సాధనం గల్లంతైంది. యాంటెన్నా, ఇతర భాగాలు మాత్రమే ఉన్నాయి. తీవ్ర కలవరం సృష్టించింది. ఎందుకంటే ఆ జనరేటర్లో ఏడు అణుశక్తి క్యాప్సూల్స్ ఉన్నాయి. హిరోషిమాపై వేసిన అణు బాంబు సామర్థ్యంలోని సగం శక్తితో ఇవి సమానం. జనరేటర్ను కనుగొనేందుకు మూడేళ్లు శ్రమించినా.. ఫలితం లేదు. చాలా వేడిగా ఉన్న ఆ జనరేటర్ హిమానీనద మంచును కరిగించుకుంటూ కిందకు జారిపోయి ఉంటుంది. అక్కడికి చేరి ఉంటే అది రుషి గంగ నదికి ప్రధాన నీటిని అందించే భాగంలోకి జారి పోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
25వేల అడుగుల ఎత్తులో ఆ పరికరాన్ని పెట్టాలనే సీఐఏ నిర్ణయం తప్పని కోహ్లీ చెప్పారు. 22వేల అడుగుల ఎత్తులోని నందా కాట్ డోమ్ వద్ద అమరిస్తే సరిపోతుందని తాను వాదించారట. 1967లో లద్దాఖ్లోని ఖర్దుంగ్లా పాస్లోని 18వేల 300 అడుగుల ఎత్తులో మరో పరికరాన్ని ఉంచాం. అది చైనా అణు సంకేతాలను అద్భుతంగా పసిగట్టిందని చెప్పారు.