2 వేల ఐ ఫోన్లు ఉచితంగా పంపిణీ

  • Published By: chvmurthy ,Published On : February 17, 2020 / 07:37 AM IST
2 వేల ఐ ఫోన్లు ఉచితంగా పంపిణీ

Updated On : February 17, 2020 / 7:37 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రజలు వణికిపోతున్నారు.  చైనాలో ఈ వైరస్‌ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం రాత్రికి 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్‌ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి.   

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్‌ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్యాధికారులు చెప్పారు. 
 

కాగా…. జపాన్‌ తీరంలో నిలిపేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలో కోవిడ్‌–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది.  అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. 

కోవిడ్ -19 సోకటంతో యెకోహోమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’  నౌకలోని ప్రయాణికులందరికీ జపాన్ ప్రభుత్వం ఐఫోన్లను ఉచితంగా పంపిణీ చేసింది. కోవిడ్‌ లక్షణాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో టచ్‌లో ఉండేందుకు అత్యాధునిక ఫోన్లను వారికి అందించినట్లు పేర్కొంది. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉన్నారు. వీరిలో దాదాపు కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 355కి చేరినట్లు వార్తలు వెలువడటంతో.. నౌకలో ఉన్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో జపాన్‌ వైద్య శాఖ, దేశ అంతర్గత వ్యవహారాల శాఖతో సమన్వయమై.. 2000 మందికి ఐఫోన్లు పంపిణీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాటిల్లో లైన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి.. ప్రయాణికులకు పంపిణీ చేశారని పేర్కొంది. తద్వారా మందుల వాడకం, వైద్యుల అప్పాయింట్‌మెంట్‌ తీసుకోవడం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్లు సైకాలజిస్టులతో చర్చించడం సహా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకునే సౌకర్యం ప్రయాణికులకు కల్పించినట్లు తెలిపింది. జపాన్‌ కాకుండా నౌకలో ఉన్న ఇతర దేశాల ప్రయాణికుల ఫోన్లలన్నింటిలో లైన్‌ యాప్‌ అందుబాటులో లేనందున ఐఫోన్లు అందించినట్లు పేర్కొంది. కాగా ఈ నౌకలో 138 మంది భారతీయులు సహా 40 మందికి పైగా అమెరికా ప్రయాణికులు ఉన్న విషయం తెలిసిందే.