కరోనా వ్యాక్సిన్‌ సరఫరాపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 12, 2020 / 03:13 PM IST
కరోనా వ్యాక్సిన్‌  సరఫరాపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Updated On : July 12, 2020 / 3:33 PM IST

గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్ బిల్‌ గేట్స్‌ వ్యాక్సిన్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ సరఫరాలో ఎక్కువ డబ్బులు బిడ్‌ చేసే వారికి కాకుండా.. అత్యంత అవసరమున్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి మహమ్మారి సమయంలో డబ్బు గురించి కాకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన తెలిపారు .

ప్రస్తుతం ప్రపంచం అత్యంత తీవ్రమైన మహమ్మారితో బాధపడుతుంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్‌, వ్యాక్సిన్‌ సరఫరాలో ఎక్కువ అవసరమున్న ప్రాంతాలకు, దేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు గురించి ఆలోచిస్తే.. మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు మార్కెట్‌ శక్తులకు అడ్డుకట్ట వేసి అందరికి సమన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి అని బిల్ గేట్స్ అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. అమెరికా, యూరోప్‌ దేశాలు ఈ పరిశోధనలు, ట్రయల్స్‌పై వేల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ధనిక దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేస్తే.. అభివృద్ధి చెందని దేశాలకు అన్యాయం జరుగుతుందని బిల్‌గేట్స్ అన్నారు.

రెండు దశాభ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన హెచ్‌ఐవీకు మందులను అందుబాటులోకి తేవడం కోసం ప్రపంచదేశాలు అన్ని కలసికట్టుగా పని చేశాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా హెచ్‌ఐవీకి మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి కూడా ఇలానే ప్రయత్నించాలని బిల్‌గేట్స్‌ సూచించారు.