Thailand To India: భార్యను కలుసుకోవడటానికి సముద్రంలో 2,000 కి.మీటర్లు సాహసయాత్ర..
భార్యను కలుసుకోవడటానికి సముద్రంలో 2,000 కి.మీటర్లు ప్రయాణం చేసిన భర్త.

Boat Man From Thailand To India
Boat Man From Thailand To India: అతనికి భార్య అంటే ప్రాణం.ఎంత ఇష్టమంటే సముద్రమంత ప్రేమ. ఆకాశమంత ప్రేమ.అంత ఇష్టమైన భార్యను కళ్లారా చూసుకుని రెండేళ్లు దాటి పోయింది. అందుకే ఇక భార్యను చూడకుండా ఉండలేకపోయాడు.అందుకోసం సాహసం చేశాడు. సముద్ర వేల కిలోమీటర్లు సముద్రంలో ఓ సాధారణ రబ్బరు పడవలో ప్రయాణం చేశాడు. సముద్రయానంలో ఎలాంటి అనుభవం లేదు. అయినా భార్యను చూడాలనే తపన ఆ సాహసం చేసేలా చేసింది. అధునాతన బోట్ను కొనేంత డబ్బులేదు. కనీసం అటువంటి బోట్ ను అద్దెకు తీసుకునేంత స్తోమత కూడా లేదు. అతనికి ఉన్నదల్లా భార్య మీద ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ అంతలేని జలరాశిపై ఒంటరిగా సాహస యాత్ర చేసేలా చేసింది. భార్యను చూడాలనే ప్రేమ మనస్సు..చేతిలో ఉన్నదల్లా ఓ చిన్న రబ్బరు పడవ, ఈ రెండింటితోనే 2వేల కిలోమీటర్ల సాహసోపేత ప్రయాణం ప్రారంభించాడు. ఇంతకీ అతడు గమ్యస్థానాన్ని చేరుకున్నాడా? ఏంటా కథ?
కరోనా.. వియత్నాంకు చెందిన దంపతులను వేరు చేసింది. రెండేళ్లు దాటినా కలుసుకోవడానికి వీలు లేకుండా చేసింది. కరోనా లాక్డౌన్, ప్రయాణ ఆంక్షలు, ఉద్యోగ సంబంధిత కారణాలతో భార్య ముంబయిలో ఉండిపోవాల్సి వస్తే.. భర్త మాత్రం స్వదేశం వియత్నాం వదలి రాలేకపోయాడు. ఈ ఎడబాటును ఇక ఏమాత్రం భరించలేని ఆ వ్యక్తి.. భారీ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. అతని పేరు హొయాంగ్ హుంగ్.
భార్య కోసం థాయ్లాండ్ నుంచి భారత్కు పడవపై హొయాంగ్ హుంగ్ ప్రయాణం చేపట్టాడు. వియత్నాం టు భారత్.. వయా థాయ్లాండ్. రెండేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యను ఎలాగైనా కలవాలని అనుకున్నాడు హో హొయాంగ్ హుంగ్. ముందు వియత్నాం నుంచి థాయ్లాండ్ వచ్చాడు. బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి వెళ్లి.. ముంబయికి ఓ టికెట్ కొందామనుకున్నాడు. ఏదో బస్సే కదా టిక్కెట్ కొనుక్కుని వెళ్లిపోయేనట్లే అనుకున్నాడు. కానీ..వీసా లేదు కాబట్టి విమానం ఎక్కడం కుదరదని చెప్పారు అధికారులు.
ఇక విమాన ప్రయాణం కుదరదు కాబట్టి బ్యాంకాక్లో బస్ ఎక్కి.. ఫుకెట్ చేరుకుని అక్కడ ఓ చిన్న పడవను కొన్నాడు. నిజానికి అది ఓ రబ్బరు షీటు. గాలి కొడితే పడవలా మారుతుంది. పొరపాటున రంధ్రం పడితే అంతే సంగతులు. అయినా.. ఆ రబ్బరు బోటుతోనే తన ‘ప్రేమ ప్రయాణాన్ని’ మొదలుపెట్టాడు హుంగ్. 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి బయలుదేరాడు.
భార్యకు కలవాలనే అతడి సంకల్పం మహా దృఢమైంది. అందుకే సవాళ్ల సముద్ర యానానికి సిద్ధపడ్డాడు. హుంగ్ కొన్న పడవకు ఇంజిన్లు, మోటర్లు వంటివి ఏమీ లేవు. తెడ్డు ఊపితేనే ముందుకు సాగుతుంది. మరో పెద్ద సవాల్ ఏమిటంటే.. నేవిగేషన్. సముద్రయానానికి కంపాస్లు, జీపీఎస్ పరికరాలు వంటివి ఎంతో కీలకం. కానీ.. ఇవేవీ హుంగ్ దగ్గర లేవు. అయినా అలానే మొండిగా ముందుకు సాగాడు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. బలమైన ఎదురుగాలుల దెబ్బకు.. ముందుకు వెళ్లాల్సిన పడవ అక్కడక్కడే తిరిగింది. కొన్నిసార్లు వెనుకకూ వెళ్లింది. అలా 18 రోజులు గడిచాయి.
ఫుకెట్లో బయలుదేరిన ప్రాంతం నుంచి అతడు చేరుకున్న దూరం 80 కిలోమీటర్లు మాత్రమే. అయినా అలానే ముందుకు సాగుతున్న హుంగ్.. మార్చి 23న సిమిలన్ దీవుల వద్ద ఓ జాలర్ల బోటులోని వారి కంటపడ్డాడు. వారు నౌకాదళాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన నేవీ సిబ్బంది.. హుంగ్ను కాపాడారు. తమ బోటులో ఎక్కించుకుని మళ్లీ థాయ్లాండ్కు తీసుకెళ్లిపోయారు.