భారత్తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి
పాక్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో..

Khawaja Asif
Khawaja Asif: భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సమా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నిజమేనని చెప్పారు.
“భారత్తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే, ఆ అవకాశాలు లేవని నేను చెప్పడం లేదు. ఉద్రిక్తతలు పెరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ, రిస్కులు ఉన్నాయన్నది నిజమే. యుద్ధం జరిగితే దేవుడి దయతో.. గతంలో కంటే మంచి ఫలితం సాధిస్తాం” అని అన్నారు.
“భారత్ ఎన్నడూ యునైటెడ్ నేషన్ కాదు. ఔరంగజేబు కాలంలో మాత్రమే తాత్కాలికంగా ఏకమైంది. పాకిస్థాన్ దేవుడి సంకల్పంతో ఏర్పడింది. పాక్లో అంతర్గతంగా ప్రజల మధ్య గొడవలు ఉంటాయి, పోటీలు ఉంటాయి.. కానీ భారత్తో యుద్ధం వస్తే ఏకమవుతాం” అని ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ఆ దేశం ప్రపంచ పటంలో లేకుండా పోతుందని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఇప్పుడు ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వారం రోజుల క్రితం కూడా ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. “భారత్ మళ్లీ దాడి చేస్తే ఈ సారి పాకిస్థాన్ నుంచి గట్టిగా సమాధానం ఉంటుంది” అని అన్నారు.
దీనికి ప్రతిస్పందనగా జనరల్ ద్వివేది ఇటీవల మాట్లాడుతూ.. “ఈ సారి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో భారత్ చూపిన నియంత్రణ ఈ సారి ఉండదు. ఈ సారి మా చర్య తీవ్రంగా ఉంటుంది. పాకిస్థాన్ తన భౌగోళిక ఉనికి గురించి ఆలోచించాల్సి వస్తుంది” అని తెలిపారు.