కరోనా వైరస్ : గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చైనాను వణికిస్తోన్న మహమ్మారి భారత్లో కూడా అడుగుపెట్టింది. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
భారత్ లో ఎంట్రీ :-
చైనాను వణికించిన కరోనా ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అటు ఢిల్లీలోనూ పలువురికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో అనుమానితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో చైనా నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్ట్లు జరిపి.. వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు :-
కేరళలో కరోనా వైరస్ నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే ఒక్కరికీ విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ నిర్వహించి.. వారిని అబ్జర్వేషన్లో పెడుతున్నారు. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఎప్పటికప్పుడు వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించారు. అందుకోసం గాంధీ ఆస్పత్రిలో వైరాలజీ ల్యాబ్ను అందుబాటులో ఉంచారు.
నోడల్ సెంటర్ గా గాంధీ :-
కరోనా అటాక్ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గాంధీ వైద్యులు. గాంధీ ఆస్పత్రిని ఇప్పటికే నోడల్ సెంటర్గా గుర్తించి ఇక్కడే టెస్ట్లు చేసేలా ప్రభుత్వం భావిస్తోందన్నారు. కరోనా వైరస్ ఇప్పటికే పలుమార్లు ఎటాక్ చేసిందని.. కానీ ఇప్పుడు వచ్చిన వైరస్ గతం కంటే ప్రమాదకరమైనదని ఆస్పత్రి జనరల్ మెడిసిన్ HOD రాజారావు అన్నారు. ఎటువంటి వైరస్ అయినా తట్టుకునే శక్తి మన వాతావరణానికి ఉందని తెలిపారు.
తప్పుడు ప్రచారం నమ్మొద్దు :-
హైదరాబాద్ నుంచి చైనాకు చదువు కోసం వెళ్లిన వారిని అక్కడి ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేసిందనే వార్తలు రావడంతో అక్కడి విద్యార్ధులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు తెలుగు విద్యార్థులు. తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. తమ కాలేజీ యాజమాన్యంతో పాటు చైనా ప్రభుత్వం మంచిగానే చూసుకుంటోందని ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు.
ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా భారత్ను తాకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వ్యాధి బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.