Breakthrough Covid-19 : షాకింగ్.. బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లతో వారికి ముప్పే
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసి
Breakthrough Covid-19 : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. అదేంటంటే.. బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్ వల్ల ముప్పేనని తేలింది. వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇబ్బందులు తప్పవని స్పష్టమైంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడిన ఇలాంటి వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం వస్తోందని అమెరికా సీడీసీ అధ్యయనం వెల్లడించింది.
కరోనాను నిరోధించే వ్యాక్సిన్ పూర్తి మోతాదులో తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడితే.. వాటి ప్రభావాలను అంచనా వేసేందుకు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 30వ తేదీ నాటికి దాదాపు 12,908 బ్రేక్త్రూ కేసులను పరిగణలోకి తీసుకుంది. ఇందుకోసం వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందిన, మరణించిన వారి సమాచారాన్ని విశ్లేషించింది. ఇలా బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్ అనంతరం ఆస్పత్రిపాలైన వారిలో దాదాపు 70శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని సీడీసీ తెలిపింది.
COVID Vaccines : ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి..సరికొత్త కోవిడ్ టీకాలు
అంతేకాకుండా బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్ సమస్యలతో మరణించిన వాళ్లలో దాదాపు 87శాతం మంది 65ఏళ్ల వయసు వారేనని వెల్లడైంది. ప్రస్తుతం ఈ అధ్యయనం కొనసాగుతూనే ఉందని.. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు వస్తున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకోని వారికి ముప్పు ఎక్కువే..
ఈ అధ్యయనం కోసం అమెరికాలోని 14 రాష్ట్రాల్లో దాదాపు 99 కౌంటీల్లోని వివిధ ఆస్పత్రుల్లో చేరిన కేసుల సమాచారాన్ని సీడీసీ పరిగణలోకి తీసుకుంది. బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో ఎక్కువగా మధుమేహం, హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న వారేనని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ విజృంభణ అధికంగా ఉన్న జూన్, జులై నెలల్లో నమోదైన కేసుల్లోనే 10 రెట్లు ఆస్పత్రి చేరికలు పెరిగాయంది.
ఇక వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నవారు ఇన్ఫెక్షన్కు గురై ఆస్పత్రిలో చేరే వారి సరాసరి వయసు 59ఏళ్లుగా తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారి ఆస్పత్రి చేరికలు 17రెట్లు ఎక్కువ అని సీడీసీ స్పష్టం చేసింది. అందుకే ఇలాంటి ముప్పులను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.
Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?
కలవరపెడుతున్న ‘బ్రేక్త్రూ’ ఇన్ఫెక్షన్లు..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడుతున్న (Breakthrough Infections) కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. భారత్లోనూ ఇప్పటివరకు దాదాపు 2.6లక్షల మందిలో బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇటువంటి కేసులు అధికంగా ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ అక్కడ కొత్త వేరియంట్ వెలుగు చూసిన దాఖలాలు లేవని జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం జనాభాలో తొలి డోసు తీసుకున్న లక్షా 70వేల మందిలో కరోనా వైరస్ బయటపడింది. ఇక రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ బారినపడిన వారి సంఖ్య 87వేలుగా ఉంది. ఇలా బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు పెరగడం కలవరపెట్టే అంశమే అయినప్పటికీ.. ప్రమాదం ఏమీ ఉండదని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు.