రిమాండ్‌లోకి లోన్ యాప్ బిజినెస్ నిర్వాహకురాలు కీర్తి

రిమాండ్‌లోకి లోన్ యాప్ బిజినెస్ నిర్వాహకురాలు కీర్తి

Updated On : January 5, 2021 / 11:06 AM IST

Loan APP: పర్సనల్ అస్యూరెన్స్ లేకుండా యాప్‌ల ద్వారా లోన్ ఇస్తున్నయాన్‌ యు అనే కొత్త కంపెనీని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో గుర్తించారు. ఐటీ కంపెనీలున్న కోరమంగళ సమీపంలోని HSR లేఅవుట్‌లో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఆర్గనైజర్ కీర్తి(31)ని సోమవారం అరెస్ట్‌ చేశారు. కాల్‌ సెంటర్‌లో 14 యాప్‌ల ద్వారా రూ.కోట్లల్లో రుణాలిస్తున్నట్లు గుర్తించారు. కంపెనీ యజమాని, చైనీయుడు వాంగ్‌ జియాన్‌ షి పారిపోయాడని సీఐ హరిభూషణ్‌ స్పష్టం చేశారు.

బెంగళూరులోని లోన్స్ యాప్‌ కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ పోలీసులకు చిక్కిన ఈశ్వర్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు యాన్‌ యు కంపెనీపై ఫోకస్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి టెంపరరీగా పనులను నిలిపివేసింది. అయినా కాల్‌సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టి ఉంచారు. స్మార్ట్‌గా ఆలోచించి సోమవారం తెల్లవారుజామున కాల్‌సెంటర్‌‌లో సామాగ్రిని తరలిస్తుండగా.. అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

బిహార్‌లో పుట్టి.. కర్ణాటకకు వచ్చి
కీర్తి బిహార్‌లోని కతిహార్‌ జిల్లాలో చదువు పూర్తి చేసి ఎంబీఏతో ఉద్యోగం కోసం ఏడేళ్ల క్రితం బెంగళూరు వచ్చింది. చిన్న కంపెనీలు, ఐటీ సంస్థల్లో పనిచేసింది. గతేడాది సెప్టెంబరులో యాన్‌ యు కంపెనీ ప్రకటన చూసి.. అప్లై చేసుకుంది. చైనీయుడు వాంగ్‌ జియాన్‌ షి ఆమెను హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమించాడు. కాల్‌సెంటర్‌లోని టెలీకాలర్ల ద్వారా రుణాలు వసూలు చేసేందుకు నియమించాడు.

గతేడాది జూన్‌లో వాంగ్‌ జియాన్‌ షి చైనా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కంపెనీకి అన్నీ తానై వ్యవహరిస్తోంది. చైనీయుడు ల్యాంబో నిర్వహిస్తున్న కాల్‌సెంటర్లలో పనిచేస్తున్న ఈశ్వర్‌కు, కీర్తి నిర్వహిస్తున్న కాల్‌సెంటర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలున్నట్లు సీఐ గంగాధర్‌ వివరించారు.