పాకిస్థాన్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు.. చేస్తున్నదెవరు?

భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా పాకిస్థాన్‌లో హత్యకావడం వెనక ఎవరి హస్తముంది..? భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోందెవరు..?

పాకిస్థాన్‌లో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు.. చేస్తున్నదెవరు?

mystery of serial killings of India most wanted terrorists in Pakistan

Updated On : December 19, 2023 / 4:15 PM IST

భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోందెవరు..? మన దేశానికి అన్యాయం చేసిన వారీ టార్గెట్ చేసి మరీ ఎవరు హత్య చేస్తున్నారు. భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా హత్యకావడం వెనక ఎవరి హస్తముంది..? దావూద్‌పై విషప్రయోగం వార్తలతో పాకిస్థాన్‌లో వరుస హత్యలపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది.

ఏడాదిగా పాకిస్థాన్‌కు చెందిన భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. ఇది మిస్టరీగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై రావడం.. టార్గెట్ చేసిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం.. ఈ హత్యలన్నింటిలోనూ కామన్‌గా కనిపిస్తోంది. పాకిస్థాన్ భద్రతాదళాలు ఈ హత్యలకు పాల్పడినవారిని గుర్తించడం కానీ అరెస్టు చేయడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. నేపాల్‌లో జరిగిన ఓ ISI ఏజెంట్ హత్యలో మాత్రం ముగ్గురిని అరెస్టు చేశారు.

రావల్పిండిలో అలమ్‌ హ‌తం
ఫిబ్రవరిలో ఈ హత్యల పరంపరం మొదలయింది. హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను ఫిబ్రవరిలో గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. రావల్పిండిలోని ఓ షాపు దగ్గర పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పీర్‌పై కాల్పులు జరిపారు. రెండు వారాల తర్వాత జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా బబాపొరా గ్రామంలో పీర్ ఆస్తులను NIA ఎటాచ్ చేసింది. పాకిస్థాన్‌లో హిజ్బుల్ లాంచింగ్ చీఫ్‌గా ఉన్న పీర్.. జమ్ముకశ్మీర్‌లోకి పేలుడుపదార్థాలు, ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు. గత ఏడాది అక్టోబరులో భారత్ అతన్ని ఉగ్రవాదగా ప్రకటించింది.

ఇంటి దగ్గరే ఖలీద్ ఖ‌తం
పీర్ హత్య జరిగిన ఆరురోజుల తర్వాత విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రజాను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ అల్-బద్ర్ మాజీ కమాండర్ ఖలీద్. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు రజా తలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఇంటి దగ్గర.. పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళ్తుండగా రజాపై కాల్పులు జరిగాయి. సింథి టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది.

జహీద్ అక్‌హండ్ పేరుతో నివస్తున్న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీమ్ మార్చి 1న హత్యకు గురయ్యాడు. కరాచీలో అతని హత్య జరిగింది. 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన ఐదుగురిలో మిస్త్రీ ఒకడు. హనీమున్ ముగించుకుని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కత్యాల్‌ను కత్తితో పొడిచి చంపింది మిస్త్రీనే.

మార్చిలో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య
ఈ ఏడాది మార్చిలోనే ఖైబుర్ పంఖ్తుఖ్వా రీజియన్‌లో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది. షాలోబర్ పాకిస్థాన్ ఆర్మీ, ISIతో కలిసి కశ్మీర్‌లో ఉగ్రదాడులు కోసం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునేవాడు. ఖలిస్థాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ కూడా ఈ మార్చిలో లాహోర్‌లోని తన ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు. ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్‌లో ఆగస్టు 1న హత్యకు గురయ్యాడు. జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖాజిమ్ కశ్మీరీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

నేపాల్‌లో లాల్ మహ్మద్ ఖ‌తం
ISI ఏజెంట్‌టా భావించే లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ నేపాల్ రాజధాని ఖాట్మండులో సెప్టెంబరు 19న హత్యకు గురయ్యాడు. లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహార్ రెహ్మాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు. జైషే మహ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్, మౌలానా మజూద్ అజ్‌హర్ సన్నిహితుడు దావూద్ మాలిక్, ఖ్వాజా షాహిద్, అక్రమ్ ఖాన్ ఘాజీ, మౌలానా రహీమ్ ఉల్లాహ్ తరీఖ్ వంటివారంతా ఇలాగే హత్యకు గురయ్యారు.

ఇలా భారత్ హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులంతా వరుసగా హత్యలకు గురికాడం వెనక ఎవరు ఉన్నారన్నది తెలియడం లేదు. ఇప్పుడు దావూద్‌పై విషప్రయోగం వార్తతో మరోసారి ఈ హత్యలపై చర్చ జరుగుతోంది.