5లక్షలకు చేరువలో కరోనా కేసులు…21వేలు దాటిన మృతులు : నిమిషాల్లోనే వైరస్ ను నిర్థారించే కిట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 693కి చేరుకుంది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణకు ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే వైరస్ నిర్థారణకు బ్రిటన్ పరిశోధకులు సులువైన విధానాన్ని కనుగొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా(యూఈఏ)కు చెందిన పరిశోధకులు నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ను నిర్ధారించే స్మార్ట్ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్ను రూపొందించారు. ఈ కిట్ తో తక్కువ సమయంలోనే కోవిడ్ను గుర్తించవచ్చు. గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా 50 నిమిషాల్లోనే కోవిడ్-19ను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కొత్తగా రూపొందించిన కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు వెల్లడించారు.
ల్యాబ్ ఆధారిత నిర్ధారణ యంత్రం ద్వారా 384 నమూనాల వరకు పరీక్షించవచ్చని తెలిపారు. స్వీయ నిర్భంద వైద్య సిబ్బంది త్వరగా తిరిగి విధుల్లో చేరేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందన్నారు. తమకు వైరస్ సోకిందో, లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్ ఉపయోగపడుతుంవన్నారు. ఈ కిట్ను నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) రెండు వారాల పాటు పరీక్షించనుంది.
NHS సిబ్బందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఆలోచనతో ఈ కిట్ను తయారుచేశాం. వారు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించగలుగుతారని రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ తెలిపారు. రెండు వారాల్లో దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ కిట్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ఎన్ఏను వెలికితీసి కోవిడ్-19 నిర్థారిత పరీక్షలు చేస్తాం. తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్ ను ఉపయోగించేలా రూపొందించినట్లు గ్రాడీ తెలిపారు.