2025లో అత్యంత ప్రభావశీలురైన 12 మందిని కోల్పోయాం.. వీరి మరణంతో ప్రపంచం కన్నీరు పెట్టుకుంది..

రోమన్ కాథలిక్ చర్చ్ చీఫ్ పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో మరణించారు.

2025లో అత్యంత ప్రభావశీలురైన 12 మందిని కోల్పోయాం.. వీరి మరణంతో ప్రపంచం కన్నీరు పెట్టుకుంది..

Updated On : December 17, 2025 / 3:25 PM IST

ఈ ఏడాది రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం, శాస్త్ర, వ్యాపార, క్రీడల రంగాలకు చెందిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 12 మంది ప్రముఖులు కన్నుమూశారు. వీరు తమ రంగంలో చెరగని ముద్రవేశారు.

శివరాజ్ పాటిల్ (1935-2025)
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ మహారాష్ట్రలోని లాతూర్‌లో తన నివాసంలో అనారోగ్యంతో డిసెంబర్ 12 మరణించారు. 2004 నుంచి 2008 వరకు హోంమంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ హోదాలు కూడా నిర్వహించారు.

శిబు సోరెన్ (1944-2025)
జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఢిల్లీలో ఆగస్టు 4న దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధితో 81 ఏళ్ల వయసులో మరణించారు. వేరు జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన గిరిజన నేతగా గుర్తింపు పొందారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

కామ్రేడ్ వి ఎస్ అచ్యుతానందన్ (1923-2025)
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్టు నేత వి ఎస్ అచ్యుతానందన్ జూలై 21న 101 ఏళ్ల వయసులో మరణించారు. తిరువనంతపురంలోని పట్టం ఎస్‌యూటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) స్థాపక సభ్యుడిగా, 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా, పలుమార్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

సత్యపాల్ మాలిక్ (1946-2025)
మేఘాలయ, జమ్మూ కశ్మీర్, గోవా, బిహార్, ఒడిశా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలో ఆగస్టు 5న 79 ఏళ్ల వయసులో మరణించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. 2020 నుంచి 2022 వరకు మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.

నవజోత్ సింగ్
ఆర్థిక మంత్రిత్వ శాఖలో మాజీ డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ సెప్టెంబర్ 14న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో మరణించారు. కారు డ్రైవర్ అరెస్టయ్యాడు.

విజయ్ రూపానీ (1956-2025)
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో మరణించారు. అతడి వయసు 68. లండన్‌కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయి ఒకరిని తప్ప మిగతా అందరూ మృతి చెందారు. గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

గోపిచంద్ హిందూజా (1940-2025)
భారత్‌-బ్రిటిష్ బిలియనీర్, హిందూజా గ్రూప్ దీర్ఘకాల చైర్మన్ గోపిచంద్ హిందూజా లండన్‌లో నవంబర్ 4న 85 ఏళ్ల వయసులో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. కుటుంబ వ్యాపారాన్ని ప్రపంచ స్థాయి బహుళజాతి సంస్థగా తీర్చిదిద్దారు. సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో సుమారు 35 బిలియన్ యుకే పౌండ్ల సంపదతో కుటుంబాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చారు. భార్య సునీత, పిల్లలు సంజయ్, ధీరజ్, రీతా ఉన్నారు.

ఫౌజా సింగ్ (1911-2025)
టర్బన్ టోర్నేడోగా పేరొందిన బ్రిటిష్-భారత మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ పంజాబ్‌లో తన గ్రామం సమీపంలో నడుస్తుండగా వాహనం ఢీకొనడంతో జూలై 14న 114 ఏళ్ల వయసులో మరణించారు.

చార్లీ కిర్క్ (1993-2025)
అమెరికా రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ (31) యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా సెప్టెంబర్ 10న కాల్పుల్లో మరణించారు. . ఆసుపత్రికి తరలించినా గాయాల వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతడిని అమరవీరుడిగా పేర్కొన్నాడు.

జేన్ గూడాల్ (1934-2025)
ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్ ప్రైమటాలజిస్ట్, మానవతావాది జేన్ గూడాల్ కాలిఫోర్నియాలో అక్టోబర్ 1న 91 ఏళ్ల వయసులో మరణించారు. టాంజానియాలో అడవి చింపాంజీలపై చేసిన పరిశోధనలు జంతు ప్రవర్తనపై శాస్త్రీయ అవగాహనను మార్చాయి.

వీస్ పైస్ (1945-2025)
భారత మాజీ ఒలింపిక్ హాకీ మిడ్‌ఫీల్డర్, క్రీడా వైద్య నిపుణుడు వీస్ పైస్ కోల్‌కతాలో ఆగస్టు 14న 80 ఏళ్ల వయసులో పార్కిన్‌సన్స్ వ్యాధితో మరణించారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.

పోప్ ఫ్రాన్సిస్ (1936-2025)
రోమన్ కాథలిక్ చర్చ్ చీఫ్ పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో మరణించారు. వాటికన్ నివాసంలో మెదడు పక్షవాతం కారణంగా కన్నుమూశారు. లాటిన్ అమెరికా నుంచి వచ్చిన తొలి పోప్, జెసూట్ వర్గానికి చెందిన తొలి పోప్‌గా చరిత్రలో నిలిచారు.

లార్డ్ స్వరాజ్ పాల్ (1931-2025)
భారత మూలాల బ్రిటిష్ పారిశ్రామికవేత్త, దాత, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ స్వరాజ్ పాల్ లండన్‌లో ఆగస్టు 21న 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. కపారో గ్రూప్ స్థాపకుడిగా ఉక్కు, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచ స్థాయి సంస్థను నిర్మించారు.