Namami Gange: గంగా నది ప్రక్షాళనకు రూ.30 వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి షెఖావత్

30k crores sanctioned for namami ganga says jal shakti minister
Namami Gange: గంగా నది ప్రక్షాళన చేస్తామని 16వ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్పుకొచ్చింది. నేటికి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. గంగా నది ప్రక్షాళనకు 30,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ప్రకటించారు. మంగళవారం నిర్వహించిన యమున పర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి వనరులు, విద్యుత్తు ఆర్థికాభివృద్ధికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
భారత దేశ జనాభా, భౌగోళిక విస్తృతి దృష్ట్యా, నీటిని, ఇతర సహజ వనరులను పొదుపుగా వాడుకోవాలని షేఖావత్ సూచించారు. గంగా నదిని, దాని ఉప నదులను ప్రక్షాళన చేయడం కోసం అనేక మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. ‘నమామి గంగే’ కార్యక్రమానికి ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోందదని, ఇది సామూహిక ఉద్యమంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. గంగా నది పరీవాహక ప్రాంతంలోని 100కుపైగా జిల్లాల్లో ఈ నదికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరిగాయని, పరిహార చర్యలను అమలు చేస్తున్నామని షెఖావత్ అన్నారు.