Arvind Kejriwal: సుకేష్ బీజేపీలో చేరడం ఖాయం.. ప్రస్తుతం సుకేష్ బీజేపీ శిక్షణ పొందుతున్నాడు: కేజ్రీవాల్
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతారని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. సుకేష్ ప్రస్తుతం బీజేపీ భాష నేర్చుకుంటున్నాడని విమర్శించారు.
Arvind Kejriwal: తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్రశేఖర్ త్వరలో బీజేపీలో చేరడం ఖాయమని అభిప్రాయపడ్డారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ తనను డబ్బులు అడిగాడని ఇటీవలే సుకేష్ చంద్రశేఖర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్ని ఆప్ నేతలు కొట్టిపారేశారు.
ఈ అంశంపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు. ‘‘సుకేష్ బీజేపీ భాష నేర్చుకుంటున్నాడు. బీజేపీలో చేరేందుకు సుకేష్కు శిక్షణ అందుతోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారు. అతడ్ని బీజేపీ స్టార్ క్యాంపెయినర్ని చేస్తుంది. బీజేపీ ర్యాలీల సందర్భంగా అతడు చెప్పే కథల్ని వినేందుకైనా జనం వస్తారని ఆ పార్టీ ఆశ. దీనివల్లనైనా బీజేపీ ర్యాలీలకు జనం వస్తారు. అతడ్ని ఢిల్లీ పార్టీ అధ్యక్షుడినైనా చేయొచ్చు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల కరెన్సీ నోట్లపై వినాయకుడు, లక్ష్మీ దేవి ఫొటోలు ముద్రించాలని కేజ్రీవాల్ సూచించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై కూడా కేజ్రీవాల్ స్పందించారు. ‘‘మనం సాధారణ మనుషులం మాత్రమే. మనం అనుకున్న పనుల కోసం చాలా కష్టపడతాం. కానీ, కొన్నిసార్లు సరైన ఫలితం ఉండదు. అయితే, మనం కష్టపడ్డప్పుడు సరైన ఫలితం రావాలంటే దేవుళ్ల దీవెనలు కూడా కావాలి. అందుకే నేను కరెన్సీ నోట్ల విషయంలో అలా స్పందించా’’ అని కేజ్రీవాల్ అన్నారు.