ఆన్లైన్ రమ్మీ తెచ్చిన చిక్కులు.. కోహ్లీ, తమన్నాకు కోర్టు నోటీసులు

ఆన్లైన్ రమ్మీ ఆటల బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా, మలయాళ నటుడు అజు వర్గీస్లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్పై కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. కేరళ హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీ గేమ్స్కు బ్రాండ్ అంబాసిడర్స్గా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించింది.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్లకు వీరు ప్రచారం నిర్వహించినట్లుగా గుర్తించి, ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, యాప్లను రద్దుచేయాలని కోరుతూ త్రిసూర్కు చెందిన పోలీ వర్గీస్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. విరాట్ కోహ్లీ, తమన్నాలను అరెస్టు చేయాలని కోరుతూ పిటీషన్ వేశారు. అమాయక యువకుల ప్రాణాలను తీస్తోన్న జూదాన్ని వీళ్లు ఎంకరేజ్ చేసినట్లుగా కోర్టుకు తెలిపారు సదరు న్యాయవాది.
ఈ ఆన్లైన్ గేమ్కు ఎక్కువ మందిని ఆకర్షించడానికి బ్రాండ్ అంబాసిడర్లు ప్రధాన పాత్ర పోషించారని తన ఫిటిషన్లో అభిప్రాయపడ్డారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకుని కోర్టు .. కోహ్లీ, తమన్నా మరియు అజు వర్గీస్లకు నోటీసులు ఇచ్చింది. 1960లో కేరళ గేమింగ్ చట్టం కింద రమ్మీని నేరంగా పరిగణించినప్పటికీ ఆన్లైన్ రమ్మీ అందులో లేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని చట్టంలో చేర్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.