Tamil Nadu rains: చెన్నైలో నదుల్లా మారిన వీధులు.. రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. చెన్నైలో వీధుల్నీ నదుల్లా మారాయి. దీంతో ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.

Tamil Nadu Rains (1)
Tamil Nadu rains: తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుంభవర్షంతో ఎక్కడా ఎడతెరిపిలేకుండా జనాలను హడలెత్తిస్తున్నాడు. భారీగా కురుస్తున్న వర్షాలకు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో వీధులు నదుల్లా మారిపోయాయి. గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో రాజధాని చెన్నైలో దాదాపు వీధులన్నీ నదుల్లా మారాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెగని వర్షాలకు నాగపట్టణం పూర్తిగా దెబ్బతింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం నవంబర్ 10, 11 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.
Read more : India Weather : తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన
రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన జిల్లాల్లో చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, చెంగల్పట్టు, కడలూర్, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్, మైలదుత్తురాయ్ ఉన్నాయి. ఆయా జిల్లాలో రానున్న కొన్ని గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇదిలావుంటే కడలూర్, విల్లుపురం, శివమొగ్గ, రామనాథపురం, కరైకాల్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది.దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.