Today HeadLines : గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
భద్రతా బలగాల అధీనంలో కర్తవ్య పథ్ ఉంది. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్ర కోట వరకు పరేడ్ సాగనుంది.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీ కర్తవ్యపథ్తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా బలగాల అధీనంలో కర్తవ్య పథ్ ఉంది. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్ర కోట వరకు పరేడ్ సాగనుంది. 77 వేల మంది పరేడ్ చూసేలా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో రాత్రి 10 నుంచి రేపు మధ్యాహ్నం పరేడ్ ముగిసేవరకు ఆంక్షలు విధించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు రోజులు ఆయన ఢిల్లీలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం అసోం నుంచి పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహర్ జిల్లాలోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించింది. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాహుల్ ఢిల్లీకి వెళ్లారు. ‘ఇండియా’ కూటమి నుంచి పలు పార్టీలు దూరమవుతున్న వేళ రాహుల్ ఢిల్లీకి వెళ్లడం గమనార్హం.
ప్రొఫెసర్ కోదండరాంకు టీఎన్జీవో కేంద్ర సంఘం శుభాకాంక్షలు
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాంకు టీఎన్జీవో కేంద్ర సంఘం శుభాకాంక్షలు తెలిపింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు మారం జగదీశ్వర్, తదితరులు ఇవాళ కోదండరాంను కలిశారు. కోదండరాం మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: కేటీఆర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మాత్రమే వినిపిస్తాయా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అనేందుకు ఇది ఉదాహరణ కదా? అని అన్నారు.
క్యాబినెట్ భేటీ..
ఈనెల 31న సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఎన్నికలకు ముందు సమావేశం కావడంతో మంత్రివర్గ నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ క్యాబినెట్ భేటీలో.. అసెంబ్లీ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వంటి కీలక అంశాలపై చర్చజరిగే అవకాశం ఉంది.
లోకేశ్ ట్వీట్..
కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రజా రాజధానికోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ సమావేశం..
ఎల్బీ స్టేడియంలో ఇవాళ కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. అదేవిధంగా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1500 రోజుకు చేరిన అమరావతి ఉద్యమం..
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆందోళనలు నేటితో 1500 రోజులు అవుతుంది. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురాగా.. అప్పటి నుంచి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఉద్యమం 1500వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అమరావతి సమర శంఖారావం పేరుతో 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెలగపూడి, మందడంలో రెండు సభలను ఏర్పాటు చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్ ..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఎపిపిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఎపిపిఎస్సి తెలిపింది.
మేరీకోమ్ రిటైర్మెంట్ ..
భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలకుతున్నట్లు ప్రకటించింది. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మేరీకోమ్ వయసు కారణంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల శంఖారావం ..
ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. బులంద్షార్ లో మోదీ భారీ ర్యాలీలో పాల్గొంటారు.
భారత్ కు ఫ్రెంచ్ అధ్యక్షుడు..
ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇవాళ భారత్ కు రానున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అవుతారు. జైపూర్ లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాజస్థాన్ లో అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్ సందర్శిస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముఖ్యఅతిథిగా మాక్రాన్ హాజరవుతారు.