Today Headlines: పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: వీరేంద్ర సింగ్
వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: వీరేంద్ర సింగ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్కు విధేయుడు అయిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అద్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్రెంట్ ప్రకటించగా మరో స్టార్ రెజ్లర్ బజ్రంగ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సాక్షి మాలిక్కు మద్దతు తెలుపుతూ తాజాగా మరో రెజర్లు వీరేంద్ర సింగ్ కూడా తన పదశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ దేశ బిడ్డ, సోదరి సాక్షి మాలిక్ కోసం పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మర్యాదపూర్వకంగా కలిశాను: పీకే
టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం ముగిశాక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నారా లోకేశ్ తో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ… మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశానని చెప్పారు. చంద్రబాబు సీనియర్ నాయకుడని.. అందుకే చంద్రబాబును వచ్చి కలిశానని చెప్పుకొచ్చారు.
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి పైనున్న హోర్డింగులు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ ఆక్సిడెంట్ సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
CBNకు PK నివేదిక..
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా పీకే టీడీపీ బలాలు ఏంటో..బలహీనతలు ఏంటో అనే అంశాలపై నివేదిక ఇచ్చారు. అంతేకాదు వైసీపీ లోటుపాట్లు ఏంటో కూడా పీకే బాబుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పీకే కార్యాచరణ రూపొందించారు. బాబుతో భేటీ అనంతరం పీకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిసే అవకాశాలున్నట్లుగా సమాచారం.
CBNతో PK భేటీ..
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అనూహ్య ఘటనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబుతో పీకే భేటీ అవడంతో ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి.
అడవుల్లో అలజడి..
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. సుక్మాజిల్లాలోని గోగుండా ప్రాంతంలో జవాన్లకు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల మృతిని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ దృవీకరించారు.
తీర్పు రిజర్వ్..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ మెమోపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.టీడీపీ నేత నారా లోకేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కేసుకు సంబంధం లేదని చంద్రబాబు అన్నారు. సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. సాక్షులను లోకేశ్ ప్రభావితం చేస్తున్నారని సీఐడీ మెమోలో చెప్పారని అన్నారు. అంతేగానీ, చంద్రబాబు అలా చేశారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. లోకేశ్ మీడియాలో మాట్లాడిన సమయంలో ఐఆర్ఆర్, హెరిటేజ్ ఫుడ్స్, లింగమ నేని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. చంద్రబాబు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు. సీఐడీ మెమోను తిరస్కరించాలని కోరారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
టెర్రర్ చెక్..
జమ్మూకశ్మీరులో శనివారం పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం అయింది. అఖ్నూర్ ప్రాంతంలో చొరబాటు యత్నం విఫలం కావడంతో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్థాన్ దేశం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో భారతదేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భారత జవాన్లు వమ్ము చేశారు.
ఎవ్వరైనా ఒక్కటే రూల్..
కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ పై వీసీ తాటికొండ రమేశ్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్దారణ అయ్యిందని అందుకే 81 మంది విద్యార్థినిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని తెలిపారు.విచారణ జరిపి..ర్యాగింగ్ జరిగినట్లుగా నిర్ధారణ అయ్యాకే సస్పెండ్ చేశామని వెల్లడించారు. ర్యాగింగ్ కు పాల్పడితే ఆడవాళ్ళయినా..మగవాళ్లైనా ఒకే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నేతలతో బాలయ్య బిజీ బిజీ..
శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ నేత పెద్దిరెడ్డి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల విషయంలో దూకుడు పెంచిన టీడీపీ నేతలతో వరుస సమావేశాలునిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ఈరోజు బాలకృష్ణ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ దూకుడు..
విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా,ప్రకాశం, అనంతపురం జిల్లా నేతలతో బాలయ్య వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ తరువాత టీడీపీ మరింత దూకుడు పెంచింది.
రేపు కలెక్టర్లతో సమీక్ష..
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
రేపటికి వాయిదా
బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా పడింది. ఈరోజుకు బదులుగా కేటీఆర్ స్వేద పత్రాన్ని రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధమైంది. కానీ ఇది వాయిదా పడింది.
అమెరికాలోనూ వేడుకలకు సన్నాహాలు ..
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. 2024 జనవరి 22న అట్టహాసంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని అమెరికాలోనూ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 15న అమెరికా వ్యాప్తంగా ఆలయాల్లో రామనామ సంకీర్తనతో వేడుకలను ప్రారంభించనున్నారు. జనవరి 21 వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమెరికాలో 21వ తేదీ రాత్రి.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుకల్లో వర్చువల్గా పాల్గొననున్నారు.
నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నిక ..
దేశ రాజధాని ఢిల్లీ, సిక్కింలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లకు వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీలో మూడు, సిక్కింలో ఒక సీటు ఉంది.
రేషన్ దరఖాస్తులు..
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మీ- సేవ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను క్షేత్ర స్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సంక్రాంతి నాటికి కొత్త బస్సులు..
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకుపైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అందులో 400 ఎక్స్ప్రెస్లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను.. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు.