RaviTeja: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం
రాజగోపాల్ రాజుకు ముగ్గురు కొడుకులు.

టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కొడుకులు. రవితేజ పెద్ద కొడుకు.
రెండో కొడుకు, నటుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతి చెందారు. మూడో కొడుకు పేరు రఘు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజగోపాల్ రాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట రాజగోపాల్ రాజు స్వగ్రామం.
కాగా, భూపతి రాజు రాజగోపాల్ ఫార్మసిస్ట్గా పనిచేసేవారు. దీంతో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల కారణంగా పలు ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చేది. పదే పదే ఇళ్లు మారాల్సి వచ్చేది. ఈ విషయాన్ని రవితేజ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దీంతో రవితేజకు అనేక ప్రాంతాల యాసలు ఒంటబట్టాయి. సినిమాల్లోకి రాకముందు రవితేజ జైపూర్, డిల్లీ, ముంబైల్లోనూ ఉన్నారు.
చిరంజీవి సంతాపం
రాజగోపాల్రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయనను చివరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్లో కలిశానని అన్నారు. రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.