మరోసారి త్రిషతో చిరంజీవి: మేసేజ్ ఓరియెంటెడ్ మూవీనే

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మక సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అనుష్క, కాజల్, నయనతార, త్రిష పేర్లు ఇప్పటివరకు వినిపించాయి. అయితే ఎట్టకేలకు త్రిషను ఈ ప్రాజెక్టుకు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఎవరు హీరోయిన్ అనే విషయంపై దర్శక, నిర్మాతలు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ట్వీట్ ఈ విషయాన్ని బయట పెట్టేసింది. ఈ ఏడాది త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారంటూ లిస్ట్ని ట్వీట్ చేశారు రమేష్ బాల. మణిరత్నంతో ‘పొన్నియిన్ సెల్వన్’, మోహన్లాల్తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారంటూ అందులో చెప్పారు.
ఈ ట్వీట్ చూసిన త్రిష స్పందిస్తూ.. నిజమే అన్నట్లుగా రాకింగ్ సింబల్తో పాటు #2020 ట్యాగ్ను జత చేశారు. దీంతో చిరు చిత్రంలో హీరోయిన్గా త్రిష అని నెటిజన్లు నిర్ధారించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. లాంఛనంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. చిరు-త్రిషలు ఇంతకుముందు మురుగదాస్ దర్శకత్వంలో ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. అది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాగా.. ఇది కూడా మేసేజ్ ఓరియెంటెడ్ మూవీనే అని అంటున్నారు.
?? #2020 https://t.co/5EF1fgx8IC
— Trish (@trishtrashers) December 14, 2019