మరో ఘోర ప్రమాదం.. ఫుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. 10 మంది మృతి.. 50 మందికి గాయాలు..
పలు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయాయి. చివరకు ఓ చోట ట్రక్ ఆగిపోయింది.
Jaipur accident: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు ట్రక్కు డ్రైవర్. దీంతో 10 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలయ్యాయి. ట్రక్ డ్రైవర్ 5 కిలోమీటర్ల మేర వాహనాలను ఈడ్చుకుంటూ వెళ్లాడని స్థానికులు చెప్పారు.
లోహమండి రోడ్డుపై ట్రక్కును డ్రైవర్ వేగంగా తీసుకెళ్తున్న సమయంలో అది అదుపుతప్పి, కార్లు, మోటార్సైకిళ్లు సహా పలు వాహనాలను ఢీకొట్టింది. వరుసగా అన్ని వాహనాలను ఢీకొట్టినప్పటికీ అతడు ట్రక్కును ఆపలేదు. (Jaipur accident)
ట్రక్కుకు ఎదురైన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. పలు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయాయి. చివరకు ఓ చోట ట్రక్ ఆగిపోయింది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
Also Read: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు.. గూగుల్ మ్యాప్స్ నుంచే రిజర్వేషన్ చేసుకునేలా..
గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, మద్యం సేవించాడా అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
నిన్న రాజస్థాన్లోని ఫాలోడిలోనూ భారీ యాక్సిడెంట్ జరిగింది. భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ నిలిచివున్న ట్రైలర్ ట్రక్ను ఢీకొట్టడంతో దాదాపు15 మంది మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు, ఇవాళ ఉదయం తెలంగాణలోని చేవెళ్లలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
